(Syed Rafi, News18,Mahabubnagar)
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సూత్రధారులతో పాటు పాత్రధారుల వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కుంభకోణంలో డజన్ మందిని జైలుకు పంపిన సిట్ (SIT)అధికారులు ..మరో నలుగురు పాత్రదారుల్ని గుర్తించారు. తీగ లాగితే డొంక కదులుతోందన్న చందంగా ఉంది. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీ(Paper leak)లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల నుంచి మహబూబ్నగర్ (Mahabubnagar)జిల్లాకు చెందిన ఈ నలుగురు ఆ పేపర్ను పొందినట్లు తెలుస్తోంది.జిల్లాలోని నవాబ్పేట (Nawabpet)మండల కార్యాలయంలో ఉపాధి హామీ పథకం విభాగంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న ప్రశాంత్(Prashanth).. లీకైన ప్రశ్నపత్రాన్ని సంపాదించి ఈనెల 5న జరిగిన ఏఈ పరీక్ష రాసినట్లుగా సిట్ గుర్తించింది. అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో పాటు షాద్నగర్(Shadnagar)కు చెందిన మరో ఇద్దరు కూడా ఏఈ పరీక్ష రాసినట్లు గుర్తించారు.నలుగుర్ని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఒకటి రెండ్రోజుల్లో ఈ నలుగురు జైలుకు పంపే పనిలో ఉంది సిట్.
ప్రశాంత్ని పట్టించిన ఫోన్ కాల్ డేటా..
ప్రశ్నపత్రాల లీకేజీలో సూత్రధారులైన రేణుక, ఢాక్యానాయక్, ప్రవీణ్, రాజశేఖర్ను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు..వారిని విచారించారు. వారి కాల్ డేటా పరిశీలించారు. ఏఈ పరీక్ష టైమ్లో రేణుక, ఢాక్యానాయక్తో టచ్లో ఉండి, పరీక్ష రాసిన వారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నవాబ్పేటకు చెందిన ప్రశాంత్ పేరు బయటపడింది. అతడ్ని విచారిస్తే మరో ముగ్గురు పేర్లు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఢాక్యానాయక్, ప్రశాంత్ ఇద్దరూ ఒకే డిపార్టుమెంట్లో పనిచేస్తున్నారు. ఢాక్యానాయక్ డీఆర్డీఏ వికారాబాద్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తుండగా, ప్రశాంత్.. నవాబ్పేట మండల కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో ఈసీ పని చేస్తున్నాడు. ఇద్దరూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారు కావడం విశేషం.
సూత్రధారులకు మూడ్రోజుల కస్టడీ ..
పేపర్ లీక్ స్కాంలోని నలుగురు కీలక నిందితులను కస్టడీకి అప్పగించాలని సిట్ అధికారులు వేసిన పిటిషన్పై కోర్టు అనుమతించింది. ఫస్ట్ టైమ్ 6 రోజులు కస్టడీకి తీసుకొని విచారించిన అధికారులు మరోసారి మూడ్రోజుల పాటు విచారించనున్నారు. గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని పొంది ఎక్కువ మార్కులు తెచ్చుకున్న టీఎస్పీఎస్సీ ఉద్యోగులు షమీమ్, రమేశ్ను, మాజీ ఉద్యోగి సురేష అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ వేసిన పిటిషన్పై తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది కోర్టు.
మిక్సర్ పొట్లాల్లా విక్రయించిన ప్రశ్నపత్రాలు..
టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లేకేజీ కేసులో ఎవరి పాత్ర ఎంత ఉంది..? ఇంకా వెలుగులోకి రాని వారెందరూ..అసలు ఈ తంతులో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి..అనే విషయాలను పూర్తిగా తెలుసుకునే పనిలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్రెడ్డి బావ పేరు ప్రశాంత్రెడ్డి కావడం, తాజాగా నవాబ్పేటకు చెందిన మరో ప్రశాంత్ పేరు తెరపైకి రావడంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Telangana crime news, TSPSC