Syed Rafi, News18,Mahabubnagar
చెల్లె పెళ్లిని ఘనంగా చేయాలని ప్రతీ అన్న కోరుకుంటాడు. అందుకు తగ్గట్టు ఓ అన్న తన చెల్లికి తగ్గ వ్యక్తిని చూసి పెళ్ళి చేయాలని నిర్ణయించారు. కానీ అంతలోనే ఆ ఇంట మాటలకందని విషాదం చోటు చేసుకుంది. ఆ చెల్లె పెళ్లిని చూద్దామనుకున్న ఆ అన్న అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. అసలేం జరిగిందంటే?
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కంసాన్ పల్లికి చెందిన ఇప్పటూరు సత్యమ్మ సత్తయ్య దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కొడుకు శ్రీనివాస్ ఆర్మీ జవాన్ గా జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. తన చెల్లికి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని..పరిగికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖరారు చేశారు. మార్చి 1న పెళ్లి ఫిక్స్ చేసుకోగా..చెల్లి వివాహం నిమిత్తం ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో బంధువులకు ఆహ్వాన పత్రికలు పంచే సమయంలో గత నెల 21న మండల పరిధిలోని కమ్మదనం వద్ద బైకు అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించగా నిన్న మృతి చెందాడు. అయితే చెల్లెలు పెళ్లి జరిగిన రోజునే అన్న కన్ను మూయడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది.
ఓవైపు పెళ్లి వేడుక..మరోవైపు విషాదం..
శ్రీనివాసు చెల్లెలు శిరీషకు వికారాబాద్ జిల్లా దారూరు మండలం రాపూర్ కు చెందిన గోవర్ధన్ తో బుధవారం వివాహం జరిగింది. వరుడు స్వగ్రామంలో నిరాడంబరంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత శ్రీనివాస్ మరణవార్త విన్న కుటుంబసభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. హుటాహుటీన కంసన్ పల్లికి చేరుకొని అంత్యక్రియల్లో కుటుంబసభ్యులు, ఆర్మీ అధికారులు, సహచరులు పాల్గొన్నారు. గాలిలో కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
ఓ వైపు పెళ్లి..మరోవైపు అన్న మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అన్న మృతితో ఆ చెల్లి బోరున విలపించింది. ఈ ఘటన స్థానికంగా అందరి చేత కంటతడి పెట్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Marriage, Telangana