Syed Rafi, News18,Mahabubnagar
భూమి పుట్టిన నాటి నుండి రైతన్న పడుతున్న కష్టం. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు భరోసా ఇవ్వడం లేదు. ఎరువు బరువై..కూలీలు కరువై. నీరు కన్నీరై..విత్తు దశ నుంచే చిత్తు చిత్తై అన్నదాతలు నిట్టూర్పు వదులుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు, కనికరించని ప్రకృతి..రైతులను జంట కోరల పాములా కాటేస్తున్నాయి. కడివెడు దాహానికి చుక్క నీరు పోసినట్లుగా..బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు అందించే రుణాలు రైతు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ప్రైవేటు వ్యాపారుల వడ్డీలు నడ్డి విరుస్తుంటే, కాళ్ల కింద భూమి కదిలిపోతుంటే..బతుకే భారమనుకుని రైతు తనువు చాలిస్తున్నారు.
కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరక, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పట్టించుకోక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే రైతుభీమా అందచేయడం తప్ప వాటి నివారణపై చిత్తశుద్ధి కనిపించడమే లేదు. వ్యవసాయ నిపుణులు చెబుతుంటే రైతుకు అండగా నిలిచే వ్యవసాయ రంగానికి సంబంధించిన ముఖ్య సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడేందుకు ప్రధాన కారణంగా మారిందని అంటున్నారు.
లెక్కలడిగితే సాకులు చెబుతున్న అధికారులు..
వికారాబాద్ జిల్లాలో గతేడాది నుండి ప్రస్తుత కాలం వరకు రైతు ఆత్మహత్యలకు సంబంధించి వ్యవసాయ అధికారులను వివరాలు కోరితే మా దగ్గర నమోదు చేయబడవని..రెవెన్యూ అధికారుల దగ్గర నమోదు చేయబడుతాయని చెప్పగా రెవెన్యూ అధికారులను అడిగితే మా వద్ద ఉండవు వ్యవసాయ శాఖ అధికారుల వద్దే ఉంటాయంటూ ఒకరిపై ఒకరు సాకులు చెప్పడం చూస్తే అన్నం పెట్టే రైతన్న మరణాల పట్ల అధికారులకు ఎంత చిత్త శుద్ధి ఉందనేది వారు చెప్పే సమాధానంలో స్పష్టంగా కనిపిస్తుంది.
రైతు ఆత్మహత్యలు నివారించాలి..
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి. రైతుల నుంచి ప్రభుత్వమే పంటను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి. ఎగుమతి, దిగుమతి విధానాలను మన రైతులకు అనుగుణంగా మార్చాలి. ప్రభుత్వం సకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, రుణ చెల్లింపునకు సహకరించాలి. మార్కెట్లో గిట్టుబాటు ధర లేనప్పుడు పెట్టుబడి వ్యయంతో పాటు అదనంగా 50 శాతం ధర చెల్లించాలని బిఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ పెద్ది అంజయ్య డిమాండ్ చేశారు.
మరో రైతు ఆత్మహత్య..
వికారాబాద్ జిల్లా యాలాల మండలం బండమీదిపల్లి గ్రామంలో బొల్లే అంజిలయ్య(35) పొలంలో సోమవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రబీలో 3 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేసాడు. రెండు రోజుల కిందటే పంట కోసి కళ్ళం కూడా వేశాడు. రాత్రి భార్య పార్వతమ్మతో కలిసి పొలంలోనే ఉన్నారు. దిగుబడి రాకపోవడంతో రాత్రి 2 గంటలకు పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు వదిలాడు. సుమారు రూ.7 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు భార్య పార్వతమ్మ తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Mahabubnagar, Telangana