తెలంగాణలో గత కొన్ని రోజులుగా చిరుత పులుల సంచారం ఎక్కువైంది. చిరుత పులులు వనాలు విడిచి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో ఓ చోట చిరుత పులి సంచారం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడ సమీపంలో చిరుత సంచరించింది. మూడు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులో కనిపించిన చిరుత, ఈరోజు తెల్లవారుజామున వేములవాడ అర్బన్ మండలంలోని మారుపాక శివారులో సంచరించింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు పులి అడుగుల గుర్తులు కనిపించాయి. ఈ విషయన్ని రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిరుతపులి సంచారంతో వేములవాడ పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక, బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులోని వ్యవసాయ బావిలో చిరుతపులి కనిపించిన సంగతి తెలిసిందే. కోరెపు సురేష్కు చెందిన వ్యవసాయ బావిలో బుధవారం చిరుత పడి ఉండటాన్ని రైతులు గుర్తించారు. దీంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. చిరుత పులిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అధికారుల సమాచారంతో హైదరాబాద్ రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకుంది. బావిలో నుంచి చిరుతను బయటకు రప్పించడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు.
అయితే అప్పటికే చీకటి పడటంతో.. గురువారం చిరుతకు మత్తు మందు ఇచ్చి బయటకు తీయాలని అధికారులు బావించారు. అయితే గురువారం తెల్లవారుజామున రెస్క్యూ టీమ్ సభ్యులకు బావిలో చిరుత కనిపించలేదు. దీంతో అది నిచ్చెన ద్వారా బయటకు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. బావి సమీపంలో పులి పాదాల ముద్రలు అధికారులకు కనిపించాయి.
Published by:Sumanth Kanukula
First published:January 17, 2021, 09:35 IST