KHAMMAM MAN ORGANIC FARMING SELLING AT CHEAP PRICES BA KMM
అమ్మ చెప్పిందని ఆర్గానిక్ సేద్యం చేస్తే.. ఖమ్మం ‘రైతు’ పంట పండింది..
ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న ఖమ్మం వాసి యోగానంద కుమార్ (కుడి వైపు వ్యక్తి)
మొదట్లో తల్లి కోరిక మేరకు సొంత స్థలంలో సాగుచేసిన యోగానంద్.. సేంద్రియ ఎరువులు, వేపనూనె మాత్రమే వాడుతూ ఆకుకూరల్ని పెంచుతూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. దీంతో ఆయనకు మరింత ఉత్సాహాన్నిచ్చినట్టు యోగానంద్ చెబుతారు.
రైతు బజార్.. పొలం పంట.. ఫాం లీవ్స్.. ఫాం వెజిటబుల్స్.. ఇలా రైతు.. ఫామ్స్ లాంటి రకరకాల పేర్లను మనం సిటీల్లో చూస్తుంటాం. వింటుంటాం. పట్టణ వాతావరణంలో ఎక్కడా కాస్తంత స్వచ్ఛత కనిపించినా వెర్రిగా ఎగబడి కొనుక్కుంటుంటాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేషనల్ హైవేలు.. సిటీ శివారుల్లో.. రోడ్ల వెంట చిన్నచిన్న అంగళ్లు మనకు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రయాణించే దారివెంట ఏదైనా స్వచ్ఛ.. రైతు.. ఫ్రం ఫామ్స్.. లాంటి పేర్లతో ఏదైనా చిన్న దుకాణం పెట్టామా ఇక పంట పండినట్టే.. మరి నిజానికి మన ఆశపడినట్టు వాటిలో స్వచ్ఛత ఉంటుందా.. అంటే చెప్పలేని పరిస్థితి.
పేరుకు ఆర్గానిక్.. కానీ ఏది తినాలన్నా భయం.. సంకోచం. అది కూరగాయైనా.. ఆకు కూరైనా.. పండ్లయినా.. తినే ఏ పదార్థమైనా కల్తీమయం.. ఇంకా చెప్పాలంటే రసాయనిక ఎరువులు.. పురుగుల మందుల మయం.. దీంతో ఎక్కడ ఏది కొనాలన్నా.. తినాలన్నా భయంభయంగానే కొంటున్నాం. తింటున్నాం. దీనికి పరిష్కారమే లేదా అంటే ఉందంటున్నారు యోగానంద్ కుమార్.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయని కూరగాయల్ని, ఆకుకూరల్ని తినాలన్న లక్ష్యంతో సొంతంగా ఆయన సాగులోకి దిగారు. స్వతహాగా బిల్డర్ అయిన యోగానంద్ తన తీరిక వేళల్లో ఇక్కడ గడుపుతుంటారు. ఖమ్మం నగరంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్కు దగ్గరలో తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఓ ఎకరం స్థలంలో ఆయన సేంద్రియ సాగును మొదలుపెట్టారు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు, తెగుళ్ల మందులు వాడకుండానే సహజ పద్దతుల్లో ఆయన సాగు చేస్తున్నారు.
పాలకూర.. చుక్కకూర.. కొత్తిమీర.. పుదీనా.. మెంతికూర.. గోంగూర.. ఇలా మనం నిత్య జీవితంలో ఉపయోగించే అన్ని రకాల ఆకుకూరలను సాగుచేస్తున్నారు. తన ఇంటి అవసరాలు తీరాక.. ఎవరికీ అమ్మాల్సిన అవసరం.. ఆలోచన లేకపోయినా.. నలుగురికి ఉపయోగపడే పనిని విస్తరించి.. కొనసాగించాలన్న ఆలోచన చేశానంటున్నారు. యోగానంద్ పూర్వీకులది వ్యవసాయ కుటుంబమే అయినా.. ఈ జనరేషన్ పూర్తిగా వ్యాపార రంగంలోనే ఉండిపోయింది. అయినా తన తల్లి కోరిక మేరకు తొలుత ఇంటి కోసం మొదలు పెట్టిన ఈ సాగు ఇపుడు అందరికోసం చేస్తున్నామంటున్నారు. అయితే నిత్యం దీన్లో కలుపు తీయడం.. వచ్చిన వారికి కట్ చేసి ఇవ్వడం కోసం మనుషులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు.
వేసిన పైరుకు నీటి కోసం డ్రిప్ సిస్టం ఏర్పాటు చేశారు. నిత్యం నీరు అవసరమైన ఈ పైరు పెంచడానికి కొద్దిగా ఓపిక, శ్రద్ధ కావాలి. లేదంటే ఎండిపోతుంది. ఎప్పటిదప్పుడు కట్ చేయకపోయినా ముదిరిపోతుంది. పెరిగింది పెరిగినట్లు ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటేనే మళ్లీ పెరుగుతుంది. దీనికి భిన్నంగా చేశామంటే మొక్క ముదిరిపోవడం.. తినడానికి పనికిరాకపోవడం ఖాయం. అందుకే ఆకుకూరల పెంపకం కష్టసాధ్యమైన పని. అయినా ఓపిగ్గా చేస్తున్న యోగానంద్ కుటుంబం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. మొదట్లో బంధువులు, స్నేహితులు.. తెలిసినవారికి ఉచితంగానే ఇచ్చినా దీన్ని ఓ పనిగా మనుషులను పెట్టి చేస్తున్నందున గిట్టుబాటయ్యేలా చేయాలన్న ఆలోచన.. తద్వారా ఆకుకూరల పెంపకాన్ని కొనసాగించాలన్న ఆలోచన వచ్చిందంటున్నారు యోగానంద్.
తాను చేపట్టిన ఆకుకూరల పెంపకంపై యోగానంద్ 'న్యూస్18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల.. మనం తినే ఆహారంలో ఉండిపోయిన వాటి కారకాలు పలు వ్యాధులకు కారణమవుతున్నాయన్నారు. క్యాన్సర్ లాంటి మహమ్మారి కేవలం తినే తిండిలో హానికారక రసాయనాల వల్ల మాత్రమే వస్తుందని, దీనికోసం ప్రతి ఒక్కరు తమకున్న కాసింత చోటులో ఏదో ఒక కూరగాయనో.. ఆకుకూరనో వేసుకుంటే మేలని సూచిస్తున్నారు. దీన్ని వృత్తిగా పెద్ద స్థాయిలో చేపట్టాలంటే ఖర్చు, వ్యయప్రయాసలతో కూడిన పని కాబట్టి ఎవరికి వాళ్లు పెంచుకుంటే సరిపోతుందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని నమ్మి తాను ఆచరణలోకి దిగానన్నారు.
మొదట్లో తల్లి కోరిక మేరకు సొంత స్థలంలో సాగుచేసిన యోగానంద్.. సేంద్రియ ఎరువులు, వేపనూనె మాత్రమే వాడుతూ ఆకుకూరల్ని పెంచుతూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. దీంతో ఆయనకు మరింత ఉత్సాహాన్నిచ్చినట్టు యోగానంద్ చెబుతారు. నిజానికి ఇప్పటికే పెద్దపెద్ద నగరాల్లో దీనిపై అవగాహన కలిగడంతోనే టెర్రస్లను కూడా వదలకుండా ఆకుకూరల సాగులోకి దిగుతున్నారు. సొంతంగా కాసింత జాగా ఉన్నవాళ్లు సైతం ఆకుకూరలు.. కూరగాయలు పండించుకుంటే తాజాగా తినొచ్చు.. ఆరోగ్యాన్ని పదిలపర్చుకోవచ్చంటున్నారు యోగానంద్. ఇలా ఖమ్మం పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాజా ఆకుకూరల్ని అందిస్తున్న యోగానంద్ను పోతుగంటి సేవాసంఘం అధ్యక్షులు పోతుగంటి వెంకటేశ్వర్లు, అన్నం సేవాసమితి అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు, కడివెండి వేణుగోపాల్ తదితరులు అభినందించారు.