అప్పటి వరకు ఎంతో హుషారుగా కనిపించింది. పెళ్లి బరాత్లో డాన్స్లో అందరినీ ఉత్సాహ పరిచింది. కానీ అంతలోనే ఏమైందో.. ఉన్నపళంగా కుప్పకూలింది. తీవ్ర అస్వస్థతతో పడిపోయింది. ఆస్పత్రి తరలించినా.. ఫలితం లేదు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. గురువారం అర్ధరాత్రి ఖమ్మం శివారులోని అల్లీపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన కథనం ప్రకారం... పెనుగూరి రాణి అనే 30 ఏళ్ల మహిళ అల్లీపురంలో భార్త, పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమెకు అమూల్య, అంజలి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త ఉప్పలయ్య దివ్యాంగుడు. ఆమె స్వస్థలం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం. పుట్టినిల్లు అల్లీపురంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
గురువారం చింతకాని మండలం సీతంపేటలో రాణి బంధువు వివాహ వేడుక జరిగింది. కుటుంబంతో కలిసి పెళ్లికి హాజరైంది. పెళ్లి కొడుకుతో తిరిగి ఇంటికి వస్తూ అల్లీపురంలో జరిగిన ఊరేగింపులో కూడా యాక్టివ్గా కనిపించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసింది. కానీ అంతలోనే రాణి కుప్పకూలింది. తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. స్థానికులు ఆమెను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ కాసేపటికే చనిపోయింది.
డీజే శబ్ధాల ధాటికి ఆమె బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. రాణి మృతితో అల్లీపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త ఉప్పలయ్య దివ్యాంగుడు కావడంతో.. ఆమె కుమార్తెలు ఆసరా కోల్పోయారని స్థానికులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brain Stroke, Khammam, Local News, Telangana