ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం సీబీఐ అదుపులో ఉన్న విజయ్ నాయర్ (Vijay Nayar), అభిషేక్ (Abhishek) బోయినపల్లిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఓ వైపు అభిషేక్, విజయ్ నాయర్ లకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ సీబీఐ స్పెషల్ కోర్ట్ వెల్లడించింది. కాగా ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబులతో కలిసి ఈడీ విచారణ జరపనుంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారి, కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. దినేష్ అరోరా స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన అధికారులు మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.
కాగా లిక్కర్ స్కామ్ లో అధికారులు మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ కు సంబంధించి వివరాలు రాబడుతున్నారు. మరోవైపు దినేష్ అరోరాను సాక్షిగా గుర్తించాలని సిబిఐ పిటీషన్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు వేసింది. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని అప్రూవర్ దినేష్ అరోరా తెలిపారు. కేసు దర్యాప్తుకు అన్ని విధాల సహకరిస్తానని అరోరా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కెమెరాల ప్రాసెడింగ్స్ మధ్య దినేష్ అరోరా వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు.
ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్ (Arvund Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సర్కార్ 2021-22కు గాను కొత్తగా ఎక్సైజ్ పాలసీ రూపొందించిన విషయం తెలిసిందే. 2021 నవంబర్ 17న అమల్లోకి వచ్చింది. దీని కింద ఢిల్లీని 32 జోన్లుగా విభజించారు. మొత్తం 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. 144 కోట్ల రూపాయల బకాయిలను కూడా మాఫీ చేశారు. ఈ లిక్కర్ పాలసీలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని బీజేపీ , కాంగ్రెస్ ఆరోపించాయి. ఎల్జీకి కూడా ఫిర్యాదు చేశాయి. ఈక్రమంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు ఆదేశాలు జారీచేశారు. మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగి.. దర్యాప్తు చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.