మహారాష్ట్ర నాందేడ్ వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రపై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ మారిన తర్వాత తొలిసారి తెలంగాణ దాటి బహిరంగ సభ నిర్వహించారు కేసీఆర్. నాందేడ్ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మీద తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా దేశంలోని చాలా చోట్ల తాగు నీరు లేదని కేసీఆర్ విమర్శించారు. తాను రాజకీయం చేయడానికి రాలేదన్న కేసీఆర్.. దేశంలో మార్పు తీసుకొచ్చేందుకే బీఆర్ఎస్ను దేశ వ్యాప్తంగా తీర్చిదిద్దున్నానని వివరించారు.
దేశం వెలిగిపోయేలా చేస్తా: కేసీఆర్
దేశంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఎందుకు జరగడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో రెండేళ్లలోనే 24 గంటల విద్యుత్ను సరఫరా చేశామన్నారు. లండన్, న్యూయార్క్లో కరెంట్ పోయినా..హైదరాబాద్లో కరెంట్ పోదన్నారు. హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చామన్నారు. దేశంలో 4 లక్షల 10 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని చెప్పారు. కానీ కేంద్రం ఇప్పటి వరకు అత్యధికంగా 2 లక్షల 15వేల మెగా వాట్ల విద్యుతే ఉత్పత్తి చేసిందన్నారు. చిత్తశుద్ధి ఉంటే దేశమంతా రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వొచ్చని కేంద్రాన్ని టార్గెట్ చేశారు కేసీఆర్ . విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పవర్ సెక్టార్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే దేశాన్నే బ్లాక్ మెయిల్ చేస్తారని... బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తామన్నారు కేసీఆర్. రెండేళ్లలోనే దేశం వెలిగిపోయేలా చేస్తామన్నారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: కేసీఆర్
మహిళల ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుతంగా ప్రగతి సాధిస్తుందన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఆ హామీని ఏడాదిలోపే అమలు చేస్తామని కుండ బద్దలు కొట్టారు. మహిళలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని.. మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం. అన్ని రంగాల్లోనూ వారి ప్రాధాన్యం పెంచుతామని.. బేటీ పడావో.. బేటీ బచావో మాటలకే పరిమితం అయిందంటూ కేంద్రం టార్గెట్గా కేసీఆర్ మండిపడ్డారు. ఉత్తర భారత్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని... హథ్రస్ ఘటన మహిళలకు రక్షణ లేదని నిరూపించిందని కేంద్రంపై విరుచుకుపడ్డారు కేసీఆర్.
రైతుల కోసమే పనిచేస్తా:
తాను రైతు పక్షపాతినని, రైతు వ్యతిరేకిని కాదన్నారు కేసీఆర్. మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా దళిత బంధును అమలు చేస్తామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.