No entry for CBI : సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI)కి కార్యకలాపాలకు ఇచ్చిన సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్)ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు అక్టోబర్ 30న తెలంగాణ హోంశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో 51ని జారీ చేసింది. కేసీఆర్ సర్కార్ తాజా నిర్ణయంతో..ఇకపై సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతనే ఏ కేసునైనా విచారణ జరపాల్సి ఉంటుంది. సీబీఐ నేరుగా దర్యాప్తు కోసం తెలంగాణలోకి ప్రవేశించడానికి వీలులేదు. ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాతనే విచారణ చేయాల్సి ఉంటుంది.
కాగా,సీబీఐ తమ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయడానికి గతంలో సాధారణ సమ్మతి ఇచ్చి, తర్వాత కాలంలో వాటికి రద్దు చేసి నో ఎంట్రీ చెప్పిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. గతంలో వెస్ట్ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం,బీహార్ లోని నితీష్ ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం,కేరళలోని పిన్నరయి విజయన్ ప్రభుత్వం,రాజస్తాన్ లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం,చత్తీస్ ఘడ్ ప్రభుత్వం, 2014కు ముందు ఏపీలో చంద్రబాబు సర్కార్ కూడా ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఇటీవల ఓ కేసు విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులను అక్కడి పోలీ్సలు అడ్డుకుని ఏకంగా స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
Rahul Gandhi : తెలంగాణలో బీసీ జనాభా గణన డిమాండ్కు రాహుల్ గాంధీ మద్దతు..
కాగా,సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని..రాజకీయ కక్ష సాధింపులకు వీటిని వాడుకుంటోందని, ఈ తరహా దాడులు ఆగాలంటే సీబీఐకి ఇచ్చిన సమ్మతిని అన్ని రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత జనరల్ కన్సెంట్ను పునరుద్ధరించింది.
సాధారణ సమ్మతి ఎందుకు
సీబీఐ సంస్థ.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్(DSPA)1946 ప్రకారం ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు ఇందుకు ఎప్పటికప్పుడు సమ్మతి నోటిఫికేషన్లు ఇస్తుంటాయి. సమ్మతి నోటిఫికేషన్ ప్రకారం... ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సీబీఐ తనిఖీలు, దర్యాప్తులు చేయవచ్చు. రాష్ట్రాల సాధారణ సమ్మతి లేకుండా అవినీతి నిరోధక చట్టం-1988, ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు, 63కుపైగా కేంద్ర చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం ఢిల్లీలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలులేదు.
అయితే, రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఊరుకునే పరిస్థితుల్లేవు. అందుకు గతంలో జరిగిన ఘటనలే నిదర్శనం. దాణా కుంభకోణంలో విచారణ నుంచి తప్పించుకునేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐని తమ రాష్ట్రాలోకి రాకుండా ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ ఉత్తర్వులను కొట్టివేయించడంతో లాలూ జైలుకెళ్లారు. ఇలా చాలానే జరిగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.