(P.Srinivas,New18,Karimnagar)
ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదని సామెత నిజం చేస్తున్నారు కొండగట్టు అంజన్న ఆలయ అధికారులు. గత నెల కొండగట్టు(Kondagattu)అంజన్న ఆభరణాలు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే.. అయితే కొంత సొత్తును దొంగల నుంచి పోలీసులు(Police) రికవరీ చేశారు. తాజాగా నిన్న కొండగట్టు అంజన్న ఆలయంలో 33.5 కిలోల వెండి ఆభరణాలు(Silver jewelry),ఇతర సామగ్రి చోరీకి గురైనట్లు శనివారం (Saturday)ఆభరణాల తనిఖీ అధికారి అంజనాదేవి ప్రకటించడంతో వాస్తవ వివరాలు వెల్లడయ్యాయి.అసలు ఆంజనేయస్వామి ఆలయం(Anjaneyaswamy Temple)లో చోరీకి గురైన ఆభరణాలు మొత్తం ఎంత..? అందులో ఎన్ని రికవరీ చేశారు..? లెక్కలోకి రాని నగలు ఎంత ఉంది..? అనేది ఇప్పుడు ఆంజనేయస్వామి భక్తుల్లో కలుగుతున్న సందేహం.
చోరీ కేసులో తెర చాటు దొంగలు..
తెలంగాణలోని సుప్రసిద్ద దేవాలయాల్లో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ఫిబ్రవరి 24న భారీ చోరీ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హనుమంతుడి ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగలు 15 కిలోల వెండి ఆభరణాలు ఇతర సామగ్రి ఎత్తుకెళ్లినట్లు ఆలయ ఈవో వెంకటేశ్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురు దోపిడీ దొంగలను పట్టుకుని వారి నుంచి 17 కిలోల వెండి ఆభరణాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్న చోరీ సొత్తు కంటే పోలీసులు అధికంగా సొమ్ము స్వాధీనం చేసుకోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది.
చోరీకి గురైన సొత్తుపై లెక్క తేలడం లేదు..
అయితే ఇదే విషయంపై దేవాదాయశాఖ ఏడీసీ జ్యోతి, ఆభరణాల తనిఖీ అధికారి అంజనాదేవి ఆలయంలో విచారణ జరిపి 33.5 కిలోల వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి చోరీకి గురైనట్లు వెల్లడించడంతో అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. ఆలయంలో స్వామివారి ఆభరణాలు, ఇతర సామగ్రి వివరాలు అధికారుల వద్ద లేకపోవడంతో చోరీకి గురైన సొత్తు గురించి అంచనా వేయలేకపోయారని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటివచోరీకి గురైన స్వామివారి పూర్తి సొత్తును స్వాధీనంచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించడంతో మిగిలిన వెండి సామగ్రి, ఆభరణాల రికవరీ ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయే అవకాశం ఉందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మిగిలిన ఇద్దరు దొంగలు పట్టుబడినా చోరీకి గురైన సొత్తు పూర్తిస్థాయిలో స్వాధీనమయ్యే అవకాశాలు లేవనిభావిస్తున్నారు.
ఎవరి పాత్ర ఎంతుందో..?
అంజన్న ఆలయం చోరీ కేసులో అధికారుల పాత్ర, పూజారుల పాత్ర ఎంత వరకు ఉన్నదని విషయాన్ని లోతుగా విశ్లేషణ జరిపితే తప్ప అసలు విషయం బయట పడదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూడు జరిగిన తర్వాత కూడా అధికారులు అప్రమత్తం లేకపోవడంతో మరోసారి కొండగట్టులో చోరీ జరిగిన విషయం సంచలనం రేపింది. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికి స్వామి ఆభరణాలను కాపాడే నాధుడు లేరని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అప్రమత్తం అవండి..
సాక్షాత్తు దేవునికి సొమ్ములకే భద్రత ఇవ్వలేని ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారనే చర్చ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోహనుమాన్ జయంతి వేడుకలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఆలయ బందోబస్తు ఎక్కువ పెంచి భక్తులకు మెరుగైన సౌకర్యార్థం అందించాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Karimangar, Telangana News