(P.Srinivas,New18,Karimnagar)
బైక్పై వెళ్తున్న దంపతులు వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన దంపతుల్ని ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తుండగా భార్య చనిపోయింది..భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. అందరూ రోడ్డు యాక్సిడెంట్(Road accident) అనుకున్నారు. పోలీసులు అలాగే భావించారు. కాని సీన్ టు సీన్ పరిశీలించిన తర్వాత పోలీసు(Police)లకు అర్ధమైంది ఇది పక్కా ప్రీ ప్లాన్ మర్డర్(Pre planned murder)అని. ఎందుకు చంపారో..? నిందితులు ఎవరో తెలిసి షాక్ అయ్యారు. కరీంనగర్(Karimnagar)జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన మర్డర్ కేసులో మిస్టరీని చేధించారు పోలీసులు.
యాక్సిడెంట్ కాదు మర్డర్..
కరీంనగర్ జిల్లాలో కుటుంబ సభ్యుల మధ్య నలుగుతున్న భూమి పంచాయితీ వ్యవహారం సంబంధం లేని వ్యక్తిని బలిగొంది. ఆస్తి విషయంలో తమకు అనుకూలంగా మాట్లాడలేదనే కోపంతో ఓ పథకం ప్రకారం దంపతుల హత్యకు స్కెచ్ వేసి దాన్ని యాక్సిడెంట్గా మార్చేశారు నిందితులు. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారుల ప్రమేయం లేకుండా కేవలం డబ్బులిచ్చి పాత్రధారులతో నేరాన్ని చేయించారు. జిల్లాలోని బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన రావుల శ్రీనివాస్ ప్రస్తుతం కరీంనగర్ సరస్వతీ నగర్లో నివాసం ఉంటూ హుస్నాబాద్ లో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు . శ్రీనివాస్ బాబాయ్కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లచ్చవ్వ , లక్ష్మీకి ఉమ్మడి ఆస్తి కింద 8కుంటల భూమి ఉంది. దాన్ని పంచుకునే విషయంలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.
సినిమా స్టైల్లో స్కెచ్..
వ్యాయమ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శ్రీనివాస్ భూమి పంచాయితీలో బాబాయ్ పెద్ద కూతురు లచ్చవ్వకు మద్దతుగా నిలిచాడు. ఈభూమి గొడవలో పెద్దనాన్ని కొడుకు శ్రీనివాస్ తన తల్లికి రావాల్సిన 8కుంటల భూమి రాకుండా అడ్డుపడుతున్నాడని లక్ష్మీ కుమారుడు దుబ్బాసి పరశురాములు కక్ష పెంచుకున్నాడు. తమకు ఆస్తి విషయంలో అన్యాయం చేశారనే కోపంతో శ్రీనివాస్ హత్యకు పథకం వేశాడు. అందుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో సుంకరి పని చేస్తున్న మామిడి వేణు, కరీంనగర్లో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న రహీం, ఖాన్పేటకు చెందిన బొల్లం శ్రీధర్ అనే ముగ్గురు స్నేహితులతో శ్రీనివాస్ని హత్య చేయించి దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేశాడు.
భూమి కోసం మర్డర్..
పరశురాములు ఫ్రెండ్స్ ముగ్గురూ కలిసి శ్రీనివాస్ని చంపడానికి రెండు నెలలుగా రెక్కీ నిర్వహించారు. శ్రీనివాస్ హెల్మెట్ పెట్టుకుంటే గుర్తించడం కష్టంగా ఉంటుందని భావించి ముందు రోజే అతని హెల్మెట్ని దొంగిలించారు నేరస్తులు. మే నెల 8వ తేదిన ఉదయం 10.45గంటల సమయంలో శ్రీనివాస్ తన భార్య రుషిఇంద్రమణితో కలిసి కోర్టు చౌరస్తాలో ఉన్న చర్చి నుంచి బైక్పై ఇంటికి వెళ్తుండగా నెంబర్ ప్లేట్ లేని టాటా సుమోతో ఆదర్శనగర్ ఢీకొట్టారు. ప్రమాదంలో శ్రీనివాస్, రుషిఇంద్రమణి తీవ్రంగా గాయపడ్డారు. ట్రీట్మెంట్ పొందుతున్న రుషిఇంద్రమణి ఈ నెల 17న మృతి చెందింది. భర్త శ్రీనివాస్ ఇంకా చికిత్స పొందుతున్నారు.
బంధువే సూత్రధారి..
హత్య పథకాన్ని సీసీ కెమెరాలు లేని చోటు చూసుకొని అమలు చేయడంతో ఎవరికి అనుమానం రాలేదు. ప్లాన్ పక్కాగా అమలు చేసిన పరశురాములు విషయాన్ని మర్చిపోయి..యధావిధిగా తన పనులు చేసుకుంటున్నాడు. బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు రోడ్డు యాక్సిడెంట్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భూమి పంచాయితీ విషయంలో తనను సోదరి లక్ష్మి కొడుకు పరశురాములు బెదిరించినట్లుగా చెప్పడంతో ఆదిశగా విచారణ జరిపారు. ప్రమాదం జరిగిన రోజు సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకు నిందితుడు పరశురామేనని తేలింది.
డెత్ కేసులో వీడిన మిస్టరీ..
హత్య జరిగిన సమయంలో నిందితుల ఫోన్ సిగ్నల్స్ పరిసర ప్రాంతాల్లోనే ఉండటంతో పరశురామ్, శ్రీధర్ , వేణులను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన సూత్రధారి, నిందితుడు పరశురామ్ సిద్దిపేట జిల్లాలోని ఓ పోలీసు అధికారి దగ్గర జీపు డ్రైవర్గా పని చేస్తున్నట్లుగా తేల్చారు పోలీసులు. హత్యకు ఉపయోగించిన టాటా సుమోను సిరిసిల్ల జిల్లా జిల్లెల గ్రామానికి చెందిన వ్యక్తి దగ్గర తీసుకున్నట్లుగా ఒప్పుకున్నట్లుగా కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. కేవలం భూ వివాదంలో మధ్యవర్తిగా ఉన్న బంధువును అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు . మూడు నెలలుగా అతని కదలికలపై దృష్టి సారించాడు . అదను చూసి వాహనంతో ఢీకొట్టించాడు . ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసినట్లుగా పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్తో చేసి హత్యకు కారణమైన ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.