(P.Srinivas,News18,Karimnagar)
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఇవేమీ తమకు పట్టనట్లు మూర్ఖులకుగా ప్రవర్తిస్తూ.. ఆడపిల్లలపై(Womens) అఘాత్యాలకి పాల్పడుతున్నారు కొంతమంది. నిర్భయ(Nirbhaya), దిశ(Disha) లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం(State Goverment) ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఆరేళ్ల గిరిజన బాలికపై ఓ గ్రామ సర్పంచ్ భర్త , అధికార పార్టీ నేత లైంగికదాడికి పాల్పడటం ఉద్రిక్తతకు దారితీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం .. మండల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళ ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆమె భర్త రాధారపు శంకర్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ రెండు రోజులకు ఒకసారి ఇంటికి వస్తుంటాడు. వీరికి ఓ కుమార్తె ( 6 ) , ఓ కుమారుడు ఉన్నారు. రెండో తరగతి చదువుతున్న బాలిక ఆ రోజు బడికి వెళ్లలేదు .
చిన్నారి తల్లి విధులకు వెళ్తూ బాలికను సర్పంచ్ ఇంట్లో వదిలివెళ్లారు. సర్పంచ్ భర్త ఇంట్లో ఎవరూలేని సమయంలో చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చిన మహిళ .. కుమార్తె తీవ్ర అస్వస్థతకు గురైనట్టు గుర్తించి ఆరా తీశారు. జరిగిన దారుణాన్ని తెలుసుకుని భర్తకు సమాచారమిచ్చారు. అనంతరం ఇద్దరూ ఈ విషయమై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని నిలదీశారు. ఆయన తప్పు అంగీకరించకపోగా , వారిని వాళ్ల ఇంట్లోనే బంధించి ఇంటికి తాళం వేశాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు శుక్రవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకుని తాళాలు పగులగొట్టి బాధితులను బయటకు తీసుకొచ్చారు . పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి పారిపోయేందుకు యత్నించిన నిందితుడి కారుపై దాడిచేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Sircilla