(P.Srinivas,New18,Karimnagar)
దైవసన్నిధిలో కాలక్షేపం చేస్తున్న పూజారి చనిపోయారు. శేషజీవితాన్ని ప్రశాంతమైన ఆలయంలో గడుపుతున్న వ్యక్తిని హతమార్చడం సంచలనం రేపింది. కరీంనగర్(Karimnagar)జిల్లా తిమ్మాపూర్ (Thimmapur)మండల కేంద్రంలోని జోగయ్యపల్లె(Jogayyapalle)లో పూజారి హత్య స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. తిమ్మాపుర హనుమాన్ ఆలయం,ఆశ్రమానికి చెందిన 60సంవత్సరాల చిలుపూరి పెద్దన్న స్వామి (Chilupuri Peddanna Swamy)అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాల క్రితం హనుమాన్ దేవాలయాన్ని నిర్మించారు. అందులోనే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఆలయం, ఆశ్రమం రెండూ ఒక్కచోటే ఉండటంతో ఆలయానికి వస్తున్న భక్తులకు మంచి, చెడు చెబుతూ ఉండేవారు. ఎవరికైనా ఏదైనా ఆరోగ్య, ఆర్ధిక సమస్యలు వచ్చినా స్వామికి చెప్పడంతో ఆయన పరిష్కరమార్గం చూపించేవారు.
ఆశ్రమంలో హత్య..
పెద్దన్నస్వామిని కలవడానికి పది రోజుల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి వచ్చి తనకు ఇంటి సమస్య ఉందని...ఒకసారి ఇంటికి వచ్చి పరిశీలించి తమ సమస్యను పరిష్కరించమని పెద్దన్నస్వామిని కోరాడు. అతని కోరిక ప్రకారం వారం రోజుల క్రితం స్వామి వరంగల్ జిల్లాకు వెళ్లి వచ్చారు. స్వామి వరంగల్ జిల్లా నుంచి వచ్చిన మూడు రోజులకే శివ తన స్నేహితుడు నీలం శ్రీనివాసు ఆశ్రమానికి వచ్చాడు. కరీంనగర్ లో పని ఉందని ఆశ్రమంలో ఉండి పని పూర్తి చేసుకొని వెళ్తామని చెప్పడంతో పెద్దన్నస్వామి వారిని ఆశ్రమంలో ఉండేందుకు ఒప్పుకున్నారు.
అర్ధరాత్రి పూజారి మృతి ..
ఆదివారం ఉదయం స్వామి డ్రైవర్ సతీష్ తో కలిసి బయటికి వెళ్లి సాయంత్రం తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమంలో ఉన్న శివ, అతని స్నేహితుడు శ్రీనివాస్ ను ఇంకా వెళ్లలేదు ఏమిటని ప్రశ్నించారు. అందుకు వాళ్లు రేపు తెల్లవారుజామును వెళ్తామని సమాధానం చెప్పారు. మరుసటి రోజు ఉదయం అనగా సోమవాం ఉదయం పూజారి స్వామి అల్లుడు సతీష్ ఆలయం శుభ్రం చేయడానికి వచ్చాడు. లోపలున్న స్వామిని పిలవడంతో అతను సమాధానం చెప్పలేదు. ఇంతలో లోపల స్వామి గదిలోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉండటం కనిపించింది. పలకరిస్తే బదులు ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చేలోపే చనిపోయి ఉన్నారని అల్లుడు సతీష్ పోలీసులకు సమాచారం అందించారు.
భక్తులే హంతకులు..
స్వామి చనిపోవడానికి ముందు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. రాత్రిఆశ్రమంలో తలదాచుకున్న శివ, శ్రీనివాస్ కూడా కనిపించకపోవడంతో లేకపోవడం ఆ ఇద్దరిపైనే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి స్వామి ఆశ్రమంలో పడుకున్న గదిలోకి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లి గొంతుకు తాడును చుట్టి చంపినట్లుగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి కర్ణాకర్ రావు,సిఐ శశిధర్ రెడ్డి,ఎస్ఐ ప్రమోద్ రెడ్డిలు పరిశీలించారు. పూజారి స్వామిని చంపాల్సిన అవసరం ఏముంటుందనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు.
డెత్ కేసులో కొనసాగుతున్న మిస్టరీ ..
చనిపోయే ముందు రోజు ఆశ్రమంలో తలదాచుకున్న శివ, శ్రీనివాస్ ను గాలించేందుకు గాలింపు చర్యల్లో భాగంగా వరంగల్ కు ఒక ప్రత్యేక బృందాన్ని పంపినట్లు రూరల్ ఏసీపీ తెలిపారు. మృతుని కుమారుడు చిలుపూరి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.త్వరలోనే నిందితులను పట్టుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. గ్త్రామస్తులు మాత్రం డబ్బు వ్యవహారమే కారణమై ఉంటుందంటున్నారు. దోషులు ఎవరైనా కఠినశిక్ష పడేలా చేస్తామని తిమ్మాపుర సీఐ స్పష్టం చేశారు. అయితే గ్రామంలో మాత్రం పూజారి హత్యకు అసలు కారణం ఏమై ఉంటుందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Karimangar