(P.Srinivas,New18,Karimnagar)
చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. కలిసి చదువుకున్నారు. కానీ విధి వారిని యాక్సిడెంట్ రూపంలో కబళించింది. ప్రమాదం ఒక్కటే అయినా రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. కష్ట సుఖాల్లోనే కాదు చివరకు చావులోనూ తోడుగానే అంటూ ఆ ఇద్దరు స్నేహితులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్సై చిరంజీవి , మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రానికి చెందిన మహ్మద్ అబ్దుల్ లతీఫ్ (32) పాత టైర్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి అబ్దుల్ లతీఫ్ తన మిత్రుడైన మహ్మద్ హమీదా ఖాన్(28)తో కలిసి మెట్పల్లిలోని తమ సమీప బంధువు వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై మెట్పల్లి నుంచి కరీంనగర్ వెళ్తుండగా అర్ధరాత్రి కొండగట్టు సమీపంలోని ఐదు కానాల వంతెన వద్ద ఎదురుగా వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న అబ్దుల్ లతీఫ్, హమీదాఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఖాన్ ను జగిత్యాల ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. దీనితో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలిస్తుండగా మృతి చెందారు.
ఇక అబ్దుల్ లతీఫ్ ను హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమీప బంధువు మహ్మద్ అబ్దుల్ రఫిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. స్నేహితులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి కారణమైన కారు జగిత్యాలకు చెందినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు.
కాగా గతంలో కూడా ఈ వంతెన పై చాలా యాక్సిడెంట్ అయినట్లు స్థానికులు తెలిపారు. ఈ వంతెనను కూలగొట్టి కొత్త వంతెనను నిర్మిస్తే వాహనాల రాకపోకలు సులువుగా ఉంటాయని వాహన దారులు అంటున్నారు. ఇరుకు వంతెన ఉండడం ఆపై అక్కడ లైట్స్ లేకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకోని కొత్త వంతెనను నిర్మిస్తే రాకపోకలకు ఇబ్బంది ఉండదని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Karimnagar, Telangana