(కరీంనగర్ జిల్లా, శ్రీనివాస్. పి, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)
కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడిని అక్షరాలా నిజం చేస్తున్నాడు ఆ యువకుడు. చిన్ననాటి నుంచే వ్యవసాయం పై మక్కువ పెంచుకున్నాడు. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. ఆవులు, ఇతర వనరులతో జీవామృతం , ఘనామృతం లాంటి సేంద్రియ ఎరువులను స్వయంగా తయారు చేస్తున్నాడు. వాటిని ఉపయోగించి 150 రకాల దేశీ వరి విత్తనాలను సాగు చేస్తున్నాడు. వ్యవసాయంలో అనేక ప్రయోగాలు చేస్తూ కరీంనగర్ జిల్లాకు చెందిన యువరైతు గారెంపల్లి శ్రీకాంత్ పై న్యూస్ 18 ప్రత్యేక కథనం మీకోసం..
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ వ్యవసాయ కుటుంబం . చిన్ననాటి నుంచే పంటల సాగుపై ఆసక్తి చూపేవాడు. పదోతర గతి తర్వాత వ్యవసాయం వైపు మళ్లాడు. అయితే మొదట్లో అందరిలాగే రసాయన ఎరువులు ఉపయోగించి తీవ్రంగా నష్టపోయాడు. వచ్చిన ఆదాయం పెట్టుబడికే సరిపోక..ఇక వ్యవసాయాన్ని మానేద్దామని అనుకున్నాడు. అదే సమయంలో ఎలాంటి పెట్టుబడీ లేకుండా సుభాష్ పాలేకర్ మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తున్నట్లు టీవీల్లో ప్రసారమైన కథనాలను చూసి స్ఫూర్తి పొందాడు. వికారాబాద్లో విజయ్ రామ్ దగ్గర పంట సాగుపై శిక్షణ తీసుకొన్నాడు. ఆ తర్వాత తన స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు. శిక్షణలో నేర్చుకున్న ప్రయోగాలు..సొంత పొలంలో విజయవంతం కావడంతో .. జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో ఐదు కరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు.
150 రకాల దేశవాళి వరి విత్తనాలను సాగు చేస్తున్నాడు. వివిధ వ్యాధుల నివారణ పోష కాలు ఉన్న వరి పంటలను పండిస్తున్నాడు. అధిక పోషకాలు కలిగిన 150 రకాల వరి విత్త నాలను వివిధ రాష్ట్రాల నుంచి సేకరించాడు. శ్రీకాంత్ వాటిని తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా ముడి మరంగి, చికిల కోయిల, అంబేమో హర్, మైసూర్ మల్లిక, గురుమట్టియ్యా, రథు నిపాల్, మాపిలే సాంబ, టిక్కిమిసిరి, అస్సాం చూడి, ఒరియాసత్త్వ, బంగారు గులాబీ, బరువ్వనాయి, గడికోడిమామడి, కుకిడమిడియా, మెలగులికలు, అర్తంకూరివై, బహుమలి, పెద్ద బట్ట, యురేనిఖాయిమా, జోహ కులకర్ణి, సోనకాడిక, నీక, బహురూపి, చిందతారి, చిన్నబెస్, కాజీసాలతో పాటు వివిధ రకాల వరి విత్తనాలను పండిస్తున్నాడు.
యువ రైతు శ్రీకాంత్ మాట్లాడుతు.. మాది రైతు కుటుంబం . చిన్ననాటి నుంచే నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం . గతంలో పెట్టుబడికి ఎక్కువగా ఖర్చయ్యేది . దాంతో ఖర్చు తగ్గించి ఎవుసం చేయాలనే ఆలోచన వచ్చింది. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో ఆవుమూత్రం , పేడతో ప్రకృతి సేద్యం చేయడం ప్రారంభించిన. ఇప్పుడు 150 రకాల వరి విత్తనాలను సాగు చేస్తున్న రైతు బాగుంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. 45 నిమిషాల్లో చల్లని నీటిలో అన్నం తయారయ్యే రకం ( బోకాసాపుల్ ) సాగు చేసి భారత సైనికు లకు అందించాలని కృషి చేస్తున్న. ఏదైనా సమాచారం కోసం నన్ను (9849408194 ) సంప్రదించవచ్చు అంటున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cultivation, Farmer, Karimnagar, Telangana