కుటుంబ కలహాలతో క్షణికావేశం ముగ్గురు ప్రాణాలను బలితీసుకున్నాయి. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో సహా ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన స్వామి హమాలీ పనిచేస్తూ భార్య విజయ, కుమారుడు శివకృష్ణ (3), కూతురు శ్రీకృతి(2)తో నివసిస్తున్నాడు. స్వామి తండ్రి చనిపోవడంతో తల్లి, భర్త చనిపోవడంతో స్వామి సోదరి పద్మ కూడా వీరితోపాటే ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలిసి ఉండాల్సిందిపోయి ప్రతీరోజు గొడవ పడుతూ ఉండేవారు. మంగళవారం కూడా గొడవ పడటంతో తన భర్తకు ఫోన్ ద్వారా తెలిపింది. ఆడపడుచు, అత్త రోజు గొడవ పడుతున్నారని తెలపగా స్వామి పనిలో ఉన్నాను.. తర్వాతకు తనే ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు. ఎన్నిసార్లు గొడవ గురించి తన భర్త వద్ద విన్నివించినా పట్టించుకోవట్లేదని వాపోయింది. తనకు తానే కుమిలిపోయింది. అదేరోజు పని ముగించుకొని స్వామి ఇంటికి రాగ రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించలేదు. కంగారు పడిన స్వామి చట్టుపక్కల వెతికాడు.
అయినా ఆచూకీ లభించలేదు. దీంతో ఉదయానికల్లా వస్తుందిలే అనుకొని ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఇంకా ఇటికి రాకపోవడంతో గ్రామస్తులకు చెప్పి వెతుకుతుండగా .. స్థానికంగా ఉన్న గ్రామస్తులు బావిలో శవాలు తేలుతూ ఉన్నాయని ఊళ్లోవాళ్లకు సమాచారం అందించారు. స్వామి కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి చూసే సరికి రెండు శవాలు తేలుతుండటంతో స్వామి అక్కడే కూలిపోయాడు.
పిల్లల శవాలను చూసి తీవ్ర రోదనకు గురైన స్వామి.. స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. విజయ చెప్పులు బావి బయట ఉండటంతో ఆమె మృతదేహం కోసం బావిలో గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, Crime, Crime news, Family suicide, Karimnagar, Mother suicide with her childrens, Peddapalli, Telangana, Tragedy, Two childrens