(పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్ 18తెలుగు)
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేసిన ఆ పెదవులు ఇప్పుడు సాయం కోసం ప్రార్థిస్తున్నాయి . వేల కిలో మీటర్లు బైక్ పై తిరిగి మహ్మమారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆ చేతులు తన ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నాయి. కరోనాపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి.. ఇప్పుడు అదే మహమ్మారి బారిన పడి పోరాడుతున్న తన తండ్రిని కాపాడాలని కోరుతుంది బామండ్ల రవీందర్ కూతురు. ఈ మేరకు కరోనా వేళ చాలా మందికి నేను ఉన్నానంటూ అండగా నిలిస్తున్న సినీ నటుడు సోనూ సూద్ను సాయం కోసం వేడుకుంటుంది. తన తండ్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సాయం చేయాలని దాతలను కోరుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా.. గన్నేరువరం మండలం చీమలకుంట పల్లెకు చెందిన బామండ్ల రవీందర్ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృతంగా ప్రచారం చేశాడు .
గతేడాది మార్చి 26 నుంచి తన బైక్కు మైక్ అమర్చి కరీంనగర్ , జగి త్యాల , పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల , సిద్ది పేట, వరంగల్ జిల్లాలోని ఆయా గ్రామా ల్లో కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు. ఇలా 15,000 కిలోమీటర్ల దూరం బైక్పై ప్రయాణించాడు. తన వంతుగా ప్రజల్లో కరోనాపై చైతన్యం తీసుకురావడానికి కృషి చేశాడు. అయితే ఇటీవల రవీందర్తో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. ఇంట్లో అందరూ కోలుకున్నా .. రవీందర్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది .
బుధవారం కరీంనగర్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరగా .. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. చికిత్సకు అయ్యే డబ్బులు లేక పోవడంతో భార్యాపిల్లలు ఆందోళన చెందుతున్నారు . దాతలు సాయం చేయాలని కోరుతున్నారు . రవీందర్ కూతురు అక్షర ' మా నాన్న చికిత్స కోసం డబ్బులు సాయం చేయండని ' సినీనటుడు సోనుసూద్ , ఇతరులను వేడుకుంటోంది. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఆర్జిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona alert, Corona campaigned, Infected, Karimnagar