(P.Srinivas,New18,Karimnagar)
తెలంగాణా రాష్టంలోనే తొలిసారిగా జగిత్యాల(Jagityal)జిల్లాలో పాడి పశువుల్లో సరోగసి(Surrogacy)తో ఒక రెండు మగ ఒక ఆడ దూడలు జన్మించాయి. సరోగసీ అనగానే అది మనుషులకు మాత్రమే పరిమితమైన విధానమని చాలామంది అనుకుంటారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచనను తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ(Telangana Livestock Development Corporation) మార్చేసింది. పాడిపశువుల్లోనూ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసి రికార్డులకెక్కింది. జగిత్యాల జిల్లాలో ఈ విధానంలో మూడు లేగదూడలు జన్మించాయి.
ఫస్ట్ టైమ్ పశువుల్లో ..
పశువుల్లో సరోగసి (అద్దె గర్భం) ద్వారా పశు సంతతిని అభివృద్ధి చెందించవచ్చని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (LDA),ప్రయోగాత్మకంగా నిరూపించింది. ఎల్డీఏ, కోరుట్ల పశువైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాడిపశువుల అభివృద్ధికి ఇది కీలక మలుపు కాగలదని ఎల్డీఏ సీఈవో డాక్టర్ మంజువాణి పేర్కొన్నారు. సరోగసీ విధానం ద్వారా సాహివాల్ దేశీయ జాతి గిత్త నుంచి వీర్యాన్ని సేకరించి ఫలదీకరణం చేయించి ఆ ఎంబ్రియోలను జెర్సీ ఆవు గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం తెలంగాణకు రూ. 5.83 కోట్లు కేటాయించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పశువైద్య కళాశాలలో ఈ ప్రయోగాన్ని చేపట్టిన అధికారులు మొత్తం 19 ఎంబ్రియోలను ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. అనంతరం వాటిని ఆవుల గర్భంలో ప్రవేశపెట్టారు. వీటిలో ఒక ఆడ దూడ, రెండు మగదూడలు పుట్టినట్టు మంజువాణి తెలిపారు.
సరోగసి విధానంలో పశువుల్లో సంతానోత్పత్తి..
సరోగసీ విధానంలో రాష్ట్రంలో దూడలు జన్మించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా చెప్పుకోవాలి. రైతుల ఆర్థికాభివృద్ధి, పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఆడ దూడలు మాత్రమే పుట్టేలా పరిశోధనలు చేస్తున్నట్టు చెప్పారు. మేలైన గిత్త వీర్యాన్ని ప్రయోగశాలలో విభజించే పరిజ్ఞానంపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి అది కూడా సాధిస్తామని మంజువాణి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే విధానంలో ఒక ఎంబ్రియోను పాడిపశువుల గర్భంలో ప్రవేశపెట్టేందుకు ప్రైవేటు సంస్థలు రూ. 16,500 వసూలు చేస్తున్నాయని, తాము మాత్రం పూర్తి ఉచితంగానే చేస్తున్నట్టు తెలుపుతున్నారు.
ప్రయోగం సక్సెస్ ..
పశువుల్లో కృత్రిమ గర్భ విధానం ద్వారా పశువుల్లో సంతానోత్పత్తి పెంచుతూ వస్తున్నారు. ఈ పద్ధతిలో గిత్తల నుంచి సేకరించిన వీర్యాన్ని నేరుగా పశువులకు ఇంజెక్ట్ చేస్తారు. సరోగసీ విధానంలో మాత్రం సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలల్లో ఫలదీకరణం చేయించిన అనంతరం ఎంబ్రియోలను పశువుల గర్భంలో ప్రవేశపెడతారు.ఇలా చేయడం వలన రానున్న రోజుల్లో పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు పాల ఉత్పత్తులు పెరుగుతాయంటున్నారు. ప్రజలకు మెరుగైన పాల ఉత్పత్తులు అందించడమే తమ లక్ష్యమని పశుగణాభివృద్ధి సంస్థ అధికారిణి మంజుల వాణి స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jagityal, Telangana News