(పి.శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)
హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడిని ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోలేకపోతున్నారు . ముఖ్య మంత్రి కేసీఆర్ .. ఈటలను ఓడించేందుకు ఎత్తులపై ఎత్తులు వేస్తుంటే ఈ నాయకులు మాత్రం ఇంకా తమ ముఖ్య నాయకుల్లో ఒకరని చెప్పుకుంటున్నారు . ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది . జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల అధ్యక్షురాలు ఎం . స్వర్ణలత , ఆమె భర్త రాజనర్సింగరావు శనివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు .
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ తయారు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు . ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ .. మాజీ మంత్రి ఈటల రాజేందర్ , మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ , స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిలో ఫోటోలు ముద్రించారు .
ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినని ప్రచారం చేసుకుంటుంటే ఇంకా టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆయన తమ పార్టీ నాయకుడే అని ఓన్ చేసుకుంటుండడం విశేషం . ఇటీవల కొడిమ్యాల మండలం పూడురులోని ఖాదీ భండార్ భూములను కొనుగోలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న నాయకుడే చేనేత కార్మికులకు శుభాకాంక్షలు చెబుతుండటంపై కూడా కొందరు సెటైర్లు వేస్తున్నారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Eetala rajender, Karimnagar, Kcr