(P.Srinivas,New18,Karimnagar)
కరీంనగర్(Karimnagar)జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లో గత కొద్దిరోజులుగా వెలుగు చూస్తున్న సదరం నకిలీ ధ్రువపత్రాల(Fake certificates) విచారణపై ఎట్టకేలకు ఏసీబీ(ACB) అధికారులు గత రెండు, మూడు రోజుల నుండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అవసరమైన ప్రతి చిన్న ఆధారాలు గురించి లోతుగా ఆరా తీయడంతో నివ్వెర పోయే నిజాలు బయటపడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో డీఆర్డీఏ (DRDA)ఆధ్వర్యంలోని సదరం సిబ్బంది ఇష్టానుసారంగా నకిలీ వ్యక్తులకు ధ్రువపత్రాల్ని సృష్టించి డబ్బులకు అమ్ముకున్నారని ఏసీబీ రాష్ట్రస్థాయి అధికారులకు అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ రాశాడు. దాని ఆధారంగా కరీంనగర్ ఇన్స్పెక్టర్(Inspector)ఆధ్వర్యంలో విచారణను గడిచిన కొన్ని రోజులుగా చేపడుతున్నారు . దర్యాప్తులో భాగంగా కీలకమైన విషయాలు అధికారి దృష్టికి వచ్చయి.
4ఏళ్లుగా కొనసాగుతున్న దందా..
ముఖ్యంగా 2017 డిసెంబరు నుంచి 2021 డిసెంబరు వరకు సదరం నుంచి జారీ చేసిన ప్రతి పత్రాలపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఈ నాలుగేళ్లలో సుమారు 4000 మందికి వైకల్యాన్ని సూచించేలా శాతంతో కూడిన అర్హత పత్రాలను జిల్లాసుపత్రిలోని సదరం శిబిరం నుంచి జారీ చేశారు. వీటి ఆధారంగా పలువురు నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పింఛను పొందారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను విషయంలో లబ్ధిని పొందుతున్నారనేది విచారణ బృందానికి తెలిసొచ్చింది. అసలు అనర్హులైన వారికి 1000 పత్రాలను అందించారనేది ప్రాథమిక విచారణలో అధికారుల దృష్టికి వచ్చింది . వీటన్నింటిని తమకు అందించాలనేలా అవినీతి నిరోదకశాఖ ఇన్స్పెక్టర్ డీఆర్డీఏ ఆఫీస్కి లేఖ రాసినట్లుగా సమాచారం.
సర్కారు ఖజానాకే గండి..
జిల్లాసుపత్రి కేంద్రంగా అనర్హులకు సదరం ద్వారా ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారనే ఆరోపణలతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విచారణ మొదలైంది . జిల్లా స్థాయిలోని ఏపీడీ స్థాయి అధికారి క్షేత్రస్థాయికి వెళ్లి సుమారు నెల రోజుల పాటు విచారణ జరిపి .. పాలనాధికారికి నివేదిక అందించారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులు, సూత్రధారుల్ని వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. దాంతో అవినీతి జరిగిన శాఖల్లోని పెద్దలంతా ఈ బోగస్ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకున్నారు. చర్యలు తీసుకున్నామని నమ్మే విధంగా ఇద్దరు కాంట్రాక్ట్ సిబ్బందిని పక్కనపెట్టి చేతులు దులుపుకున్నారు.
అవినీతి జలగలు..
ఒక్కో ధ్రువపత్రానికి సంబంధించి లక్ష నుండి రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారనేలా ఆడియో రికార్డులున్నాయి. ఇతరత్రా ఆధారాలు అధికారులు దృష్టికి వచ్చినా .. కనీసం స్పందించకపోవడంతోపాటు విచారణ నివేదిక తరువాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఓ బాధితుడు ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సదరు బాధితుడు కూడా తన వద్ద కొంత మొత్తాన్ని తీసుకున్నారని .. అయినా వారు పింఛన్ వచ్చేందుకు అవసరమైన శాతాన్ని మాత్రం ధ్రువీకరణ పత్రంలో ఇవ్వలేదని లేఖలో వాపోయినట్లు తెలిసింది .
వదిలే ప్రసక్తే లేదు..
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అసలు వైకల్యం లేని వారు కూడా వీటిని పొంది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా .. కనీసం జిల్లాలో ఇలాంటివెన్ని ఉన్నాయనేలా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టకపోవడం శోచనీయం. రాజకీయ ఒత్తిళ్లతో పాటు ఎక్కడ ఈ వ్యవహారాన్ని పట్టించుకుంటే తమ ఉద్యోగాలకు ఎసరొస్తుందనే భయంతోనే కొందరు గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. భారీ స్థాయిలో జరిగిన ఈ కుంభకోణంపై ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు రాబట్టే పనిలో పడ్డారు. కుంభకోణంలో ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వారిని కటకటాల వెనక్కి పంపి తీరుతామంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara Pension Scheme, Karimnagar, Scams