యాదాద్రి భువనగిరి జిల్లా సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా, బీజేపీపైన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Telangana BJP Chief Bandi sanjay) మండిపడ్డారు. ఈ మేరకు పెద్దపల్లి (Peddapalli) జిల్లా వెంకట్రావుపల్లెలో మీడియాతో మాట్లాడారు. అనంతరం సంజయ్ ప్రకటన విడుదల చేశారు. "కేసీఆర్ (KCR) అవినీతిపై విచారణ జరగబోతోంది. తన ఫని ఖతమైందని గ్రహించి తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయ లబ్ది పొందే కుట్రలో భాగమే నరేంద్రమోదీపై ఆరోపణలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ సమాజమంతా అసహ్యించుకుంటోంది. దీనిపై ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నరు" అని తెలిపారు.
‘‘కేసీఆర్ పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నడు. అడ్డగోలుగా బూతులు మాట్లాడుతున్నడు. లాక్ డౌన్ పెట్టడం తప్పని ఈ రోజు కేసీఆర్ చెప్పడం సిగ్గుండాలి. ఆనాడు లాక్ డౌన్ పై ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం స్పూర్తిదాయకమని, మోదీ గొప్ప నిర్ణయమని కేసీఆర్ పొగిడిన సంగతిని మర్చిపోయిండు. కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచమంతా ప్రశంసిస్తే.. కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితమై పారాసిటమాల్ సీఎంగా విమర్శలపాలైండు.
మోదీ (Modi) వద్దకు పోయి వంగి వంగి దండాలు పెట్టడం.. ఇక్కడికొచ్చి తిట్టడం కేసీఆర్ కు అలవాటైంది.కేసీఆర్ చెల్లని రూపాయి. రైతు చట్టాలను పొగిడి.. ఇప్పుడు విమర్శిస్తుండటం సిగ్గు చేటు. వ్యవసాయ బోర్లకు కరెంటు మీటర్లు పెట్టాలని కేంద్రం ఏనాడైనా చెప్పిందా? నీకు దమ్ముంటే.. నీకు చిత్తుశుద్ధి, నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే నా సవాల్ కు స్వీకరించాలి.
చీకటి ఒప్పందం ఈరోజు బయటపడింది..
కేంద్రం ఎప్పుడైనా బోర్లకు మీటర్లు పెట్టాలని (To put meter to Bores) చెప్పినట్లుగా నిరూపిస్తే నేను ప్రజలకు బహిరంగ క్షమాపణ (Apology) చెప్పేందుకు సిద్ధం.. నిరూపించకపోతే.. నువ్వు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. డిస్కంలకు రూ.48 వేల కోట్లు బాకీ ఎందుకు పెట్టిండో కేసీఆర్ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ – టీఆర్ఎస్ చీకటి ఒప్పందం ఈరోజు బయటపడింది. ఈరోజు సభలో కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి అనుకూలంగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనం.
పార్లమెంట్ లోనూ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి టీఆర్ఎస్ సభ్యులకు పదేపదే సపోర్ట్ చేశారు. తెలంగాణలో మతపిచ్చి లేపుతోంది కేసీఆర్.. కర్నాటకలోని హిజాబ్ వివాదాన్ని లేవనెత్తి మత కల్లోలానికి కుట్ర చేస్తున్నరు.
రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో అరిగోస పడుతున్నరు. కేంద్రం అవినీతికి పాల్పడుతోందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి నిరూపించాలి. వారం రోజుల్లో కేంద్రం అవినీతి చిట్టా బయటపెడతావా?... నేనే బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధం. కేంద్ర మంత్రిగా ఉంటూ సహారా, ఈఎస్ఐ స్కాంలో మొదటి ముద్దాయి కేసీఆరే. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ.. తాను చేసిన వ్యాఖ్యలను దారి మళ్లించేందుకే కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నరు. తెలంగాణ ప్రజలారా.. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్న టీఆర్ఎస్ కావాలా?.. అంబేద్కర్ రాజ్యంగంతో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ కావాలా? తేల్చుకోండి” అని బండి సంజయ్ అన్నారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, Karimnagar, Telangana