తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) విషయంలో ఈటెల రాజేందర్ (Etela Rajender) తన పంతం నెగ్గించుకున్నారా అంటే అవుననే అంటున్నారు ఈటెల శ్రేణులు. అసెంబ్లీకి పోటీ చేయబోతున్న బండి సంజయ్ కు ఈటెల షాక్ ఇచ్చారా..ఇప్పుడు ఇవే ప్రశ్నలు స్టేట్ బీజేపీలోనూ, కరీంనగర్ బీజేపీలోనూ పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ఎంపీగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) ఈసారి కరీంనగర్ అసెంబ్లీ నుండి కాకుండా వేములవాడ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. అక్కడ తన వర్గాన్ని ఎంకరేజ్ చేయటంతో పాటు ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షునిగా వీలున్నప్పుడల్లా పర్యటించారు. రాష్ట్ర అధ్యక్షునిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ సీటు పక్కా అని, ఇప్పటికే రెండుసార్లు కరీంనగర్ నుండి ఓడిపోయారు. కాబట్టి మళ్లీ అక్కడకు ఆయన వెళ్లరని అంతా ఫిక్స్ అయిపోయారు.
కానీ, ఈటెలతో పాటు పార్టీలోకి వచ్చిన తెలంగాణ ఉద్యమ లీడర్, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ వేములవాడ సీటు కోసం ముందు నుండి ప్రయత్నిస్తున్నారు. ఈటెల కూడా తనకు సీటుపై హామీ ఇచ్చే పార్టీలోకి తీసుకున్నారన్నది ఓపెన్ సీక్రెట్. కానీ తీరా బండి సంజయ్ ఫోకస్ చేయటంతో వేములవాడ సీటు విషయంలో బండి వర్సెస్ ఈటెలగా మారిపోయింది. పైగా సీట్లపై వ్యక్తిగతంగా ఎవరేం చెప్పినా పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటూ ఈటెల విషయంలో బండి సంజయ్ గతంలో ఘాటుగానే స్పందించారు. నాటి నుండి ఆ పంచాయితీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. కాగా, అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీజేపీ .. ఇబ్బంది లేని సీట్ల విషయంలో నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల ఈటెల రెగ్యూలర్ గా ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉంటున్నారు.
ఢిల్లీ పర్యటనలు కూడా చేస్తుండటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈటెల ఢిల్లీలో చక్రం తిప్పటంతోనే బండి సంజయ్ కు చెక్ పడిందని, తుల ఉమకు ఈటెల రాజేందర్ దగ్గరుండి వేములవాడ సీటు పక్కా చేయించారన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. ఇక ఎల్లారెడ్డి నుండి ఈటెల అనుచరుడు ఏనుగు రవీందర్ రెడ్డికి సీటు ఖాయం కాగా..మరికొన్ని చోట్ల తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునే పనిలో ఈటెల ఉన్నారని, అలా సీట్లు ఇస్తే బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా బీజేపీ గూటికి తెచ్చే బాధ్యత తనదని ఈటెల అధిష్టానానికి మాటిచ్చినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతానికి స్టేట్ బీజేపీలో పవర్ సెంటర్ గా ఉన్న బండి సంజయ్ సొంత స్థానానికే ఈటెల ఎసరుపెట్టారుగా..అంటూ లోలోపల పాలిటిక్స్ చర్చలు సాగుతోన్నాయి.
కాగా, అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీజేపీ..ఇబ్బంది లేని సీట్ల విషయంలో నేతలకు క్లారిటీ ఇస్తోంది. పోటీకి రెడీ చేసే పనిలో పడింది. అందులో భాగంగా బండి సంజయ్ విషయంలోనూ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుండే పోటీ చేయాలని, మంత్రి గంగుల కమలాకర్ ను ఓడించాల్సిందేనని పార్టీ ఆదేశించినట్లు సమాచారం. దీంతో కరీంనగర్ విషయంలో స్వతహాగా సర్వే కూడా చేయించుకున్న బండి పోటీకి మొగ్గు చూపుతున్నారని, అందుకే ఇక నుండి వారంలో ఒక రోజు కరీంనగర్ అసెంబ్లీకే తన సమయం కేటాయిస్తానని ప్రకటించారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈటెల ఢిల్లీలో చక్రం తిప్పటంతో తన పంతం నెగ్గించుకొని జనంలోకి వెళ్తున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Etela rajender, Karimnagar, Telangana, Vemulawada