(P.Mahendar,News18,Nizamabad)
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తాళి అనే బంధంతో ఒక్కటయ్యేదే భార్య భర్తల అనుబంధం. ఎంత కష్టమొచ్చినా .. తోడు నీడగా ఉండేది ఆలుమగలే. కామారెడ్డి (Kamareddy)జిల్లాలో కూడా ఇదే విధంగా ఒకరి కోసం ఒకరు పుట్టారన్నట్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఈలోకాన్ని విడిచివెళ్లడం అందరికి బాధను కలిగించింది. దాంపత్య జీవితానికి చిహ్నంగా పుట్టిన బాబు,పాప ఆలనా, పాలన చూడకుండానే ఇద్దరూ చనిపోయారు. ఒకరు విధి వక్రించి మరణిస్తే మరొకరు ఆ బాధను తట్టుకోలేక బలవన్మరణం( Suicide) చేసుకోవడం అందర్ని కంటతడి పెట్టించింది.
భర్త జ్ఞాపకాలు మరువలేక..
కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన మెత్తల అశోక్ భార్గవిని నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా కూతురు ధన్విక, కొడుకు అద్వైత్ ఉట్టారు. ఆంతా సవ్యంగా ఉంది.. వీరి సంసారం హాయిగా సాగుతుంది. అయితే గత డిసెంబర్ నెల 21న అశోక్ పశువు లకు దాణా పెట్టడానికి పొలానికి వెళ్లి బావిలో నీళ్ల కోసం దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి నీటి మునిగి చనిపోయాడు అశోక్. దాంతో భార్య భార్గవి కన్నీరు మున్నీరుగా విలపించింది. అయినా భర్తను మర్చి పోలేక భార్య భార్గవి మనస్తాపానికి గురయ్యింది.
చావులో కూడా కలిసే ..
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త లేకుండా 20 రోజులుగా జీవించిన బార్గవి ప్రతి రోజు భర్తను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకునేది. పదే పదే భర్త జ్ఞాపకాలు మదిలో మెదులుతుండటంతో ..తట్టుకోలేకపోయింది. జనవరి 10న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది భార్గవి. కూతురు ఉరివేసుకున్న విషయాన్ని గమనించిన భార్గవి తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే భార్గవి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
అనాథలైన చిన్నారులు..
తండ్రి ప్రమాదవశాత్తు చనిపోవడం, తల్లి బలవన్మరణం చేసుకోవడంతో ..ఇద్దర్ని కోల్పోయిన చిన్నారులు ధన్విక ,అద్వైత్ అనాథలుగా మారారు. ఒకరిపై మరొకరు పెంచుకున్న ప్రేమ వాళ్లను విడిగా బ్రతకనివ్వలేదని అశోక్, భార్గవి ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లని గ్రామస్తులు అంటున్నారు. 21 రోజుల వ్యవదిలో భార్య, భర్తలు ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. అయితే నాధలైన ఇద్దరు చిన్నారులు మాత్రం తమకు తల్లిదండ్రులు ఉన్నారా లేరా అనే విషయం కూడా అర్ధం కాని పరిస్తితుల్లో ఉన్నారు. అభం,శుభం తెలియని చిన్నారులు అనాధలుగా మారడం చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. భార్గవి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family suicide, Kamareddy, Telangana News