తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Telangana high court Chief Justice Ujjal Bhuyan)ఇవాళ (28 జూన్, మంగళవారం) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అధికార నివాసమైన రాజ్ భవన్ వేదికగా నేటి ఉదయం 10.05కు ఆయన బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) కొత్త సీజేతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కూడా పాల్గొన్నారు. కొత్త సీజే జస్టిస్ భుయాన్ కు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో దాదాపు ఏడాది కాలంగా గవర్నర్ వర్సెస్ సీఎం అన్నట్లుగా వ్యవహారం సాగుతుండటం, రాజ్ భవన్ - ప్రగతి భవన్ నుంచి పరస్పర విరుద్ధ, పోటాపోటీ ప్రకటనలు వెలువడటం, సీఎం తీరుపై గవర్నర్ కేంద్రానికి సైతం ఫిర్యాదులు చేయడం, ఆ తర్వాత కూడా అధికార టీఆర్ఎస్ మంత్రులు, నేతలు గవర్నర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలు కొనసాగించడం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య సీఎం కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత రాజ్ భవన్ లో అడుగుపెట్టారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారంలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్ కు రాజ్ భవన్ నుంచి అధికారికంగా ఆహ్వానం రావడం, రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన కార్యక్రమం కావడంతో విభేదాలను పక్కనపెట్టిమరీ కేసీఆర్ హాజరయ్యారు. వేదికపై గవర్నర్, సీఎం పక్కపక్కనే కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
#Telangana Governor @DrTamilisaiGuv and @TelanganaCMO KCR meet at Raj Bhavan after 1year for swearing in of Chief Justice of High Court Ujjal Bhuyan pic.twitter.com/3OgW7Y6XxS
— Naveena Ghanate (@TheNaveena) June 28, 2022
సీఎం కేసీఆర్ చివరిసారిగా గతేడాది అక్టోబర్ 11న రాజ్ భవన్ కు వచ్చారు. విచిత్రంగా అది కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమమే కావడం గమనార్హం. నాడు జస్టిస్ సతీశ్ చంద్ర ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్ వచ్చిన సీఎం కేసీఆర్.. 8 నెలల తర్వాత ఇప్పుడు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఓత్ సెర్మనీలో పాల్గొన్నారు.
ఉజ్జల్ భుయాన్ 1964, ఆగస్టు 2న అస్సాం రాజధాని గువహటిలో జన్మించారు. ఉజ్జల్ తండ్రి సుచేంద్ర నాథ్ భుయాన్ అస్సాం అడ్వొకేట్ జనరల్ గా పనిచేశారు. గువహటిలోనే లా పూర్తిచేసిన ఉజ్జల్.. 1991 నుంచి లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2011లో ఆయనకు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011లో గువాహటి హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా అపాయింట్ అయ్యారు. 2019లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా చేరారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరించారు. జస్టిస్ సతీశ్ చంద్ర ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ కావడంతో తెలంగాణ హైకోర్టులోనే పనిచేస్తోన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఎలివేషన్ పై చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Governor Tamilisai Soundararajan, Telangana, Telangana High Court