శంషాబాద్ ఎయిర్ పోర్టు చుట్టూ.. పరిసరాల్లో చిరుత పులి సంచరించిన ఆనవాళ్లు లేవని.. అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తుందని వచ్చిన వార్తల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ రేంజి ఫారెస్ట్ సిబ్బంది, విమానాశ్రయం భద్రతా అధికారులతో కలసి చుట్టుపక్కల గట్టి సోదా నిర్వహించారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కెమెరాల్లో అడవి పిల్లులు.. ఊర కుక్కలు.. అడవి పందుల సంచారమే కెమెరాల్లో రికార్డయింది తప్ప చిరుతపులి ఆనవాళ్లు.. అడుగుజాడలు గాని కనిపించలేదు. విమానాశ్రయం పరిసరాల్లో తిరుగుతున్న జంతువు అడవి పిల్లిగా నిర్థారణ అయింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాల్లో అడవి పిల్లి చిత్రాలు నిన్న రాత్రి స్పష్టంగా రికార్డు అయ్యాయి. గత కొంత కాలంగా శంషాబాద్ పరిసరాల్లో చిరుత పులి సంచారం ఉందనే వార్తలు వచ్చాయి. అయితే అటవీ శాఖ సిబ్బంది పెట్టిన నిఘాలో చిరుతకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, కదలికలు లభ్యం కాలేదు. విమానాశ్రయం సిబ్బంది, స్థానికులు భయపడుతున్నారనే సమాచారంతో అటవీ శాఖ కెమెరాలు, బోనులను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసింది. మంచి ఆరోగ్యంగా, ధృడంగా ఉన్న అడవి పిల్లి చిత్రాలు కెమెరాకు చిక్కాయని, చిరుత సంచారం లేదని శంషాబాద్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి సీహెచ్. శివయ్య తెలిపారు. స్థానికుల భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
విమానాశ్రయం అధికారులు కోరటంతో ముందు జాగ్రత్తగా 10 ట్రాప్ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. అందులో కూడా చిరుత పులి కదలికలు ఎక్కడా కనిపించలేదు. కేవలం అడవి పిల్లులు మాత్రమే కనిపించాయి. ఇంత వరకు ఎక్కడ కూడా చిరుత పులి అడుగులు కనబడలేదు. ఎయిర్ పోర్టు అధికారుల విజ్ఞప్తి మేరకు మరొక 10 ట్రాప్ కెమెరాలు, ( మొత్తం 20), రెండు బోనులు (Trap Cages) కూడా పెట్టి తనిఖీలు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు మరియు విమానాశ్రయం సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది. తమ సిబ్బంది ద్వారా తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని అటవీశాఖ అధికారులు అభయం ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Leopard, Shamshabad Airport