Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్సు ప్రయాణికుల కోసం రేపటి (27-5-2023) నుంచి జనరల్ రూట్ పాస్ అందుబాటులోకి వస్తుంది. తక్కువ దూరం ప్రయాణించేవారికోసం ఈ రూట్ పాస్ తెస్తోంది TSRTC. ఇది 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలు సాగించేందుకు వీలు కల్పిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఏ ప్రాంతం వారైనా 8 కిలోమీటర్ల పరిధిలోపు ప్రయాణానికి ఈ రూట్ పాస్ పొందవచ్చు. ఇది నెల రోజులకు వర్తించే పాస్.
రూట్ పాస్ ధరలు :
సిటీ ఆర్డినర్ బస్ రూట్ పాస్ రూ.600
మెట్రో ఎక్స్ప్రెస్ రూట్ పాస్ రూ.1000
ఈ రూట్ పాస్ పొందాలి అనుకునేవారు.. అదనంగా ఐడీ కార్డు కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రూట్పాస్ని ముందుగా 162 రూట్లలో అమల్లోకి తెస్తున్నారు. దీని ద్వారా ప్రయాణికులు ఆయా రూట్లలో ఎన్నిసార్లైనా బస్సుల్లో ప్రయాణించవచ్చు. సెలవు రోజులు, ఆదివారాల్లో కూడా వెళ్లొచ్చు.
రూట్ పాస్ ఎందుకు?
ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్డినరీ బస్ పాస్ నెలకు రూ.1150 ఉంది. అలాగే మెట్రో బస్ పాస్ నెలకు రూ.1300 ఉంది. ఈ పాసులతో సిటీ అంతా తిరగొచ్చు. కానీ చాలా మంది అలా తిరగట్లేదు. వారికి అంత అవసరం రావట్లేదు. అందువల్ల ఈ పాసులు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపట్లేదు. అందుకే ఆర్టీసీ ఈ రూట్ పాస్ తెచ్చింది. ఇప్పటివరకూ విద్యార్థులకు మాత్రమే రూట్ పాస్ ఉండేది. ఇప్పుడు అందరికీ ఉండనుంది.
ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్డినరీ బస్ పాస్లు 40వేల దాకా ఉండగా.. మెట్రో బస్ పాస్లు 1.30 లక్షల దాకా ఉన్నాయి. ఇప్పుడు రూట్ పాస్లకు కూడా మంచి ఆదరణ ఉంటుందని TSRTC అధికారులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.