గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే సామాన్యులను టార్గెట్గా చేసుకొని వృద్ధులు, మహిళల మెడలో నగలు లాక్కెళ్తున్న చైన్ స్నాచర్స్ గురించే ఇప్పటి వరకు విన్నాం. కాని సికింద్రాబాద్(Secunderabad)లో ఓ నగల షాపులో పని చేస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కళ్లలో కారం చల్లి అటుపై కత్తితో పొడిచి గాయపరిచాడు. అనంతరం అతని దగ్గరున్న 14తులాల బంగారు (14 Tola gold jewellery)నగల్ని లాక్కొని పారిపోయాడు. సినిమా ఫక్కీలో దోపిడీకి పాల్పడిన నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
సిటీలో దారి దోపిడీ ...
జంటనగరాల్లో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోమవారం రాత్రి సికింద్రాబాద్ సిటీ లైట్ హోటల్ దగ్గర పవన్ అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు. హిమాయత్నగర్లోని రాధే జ్యూవెలరీ షాప్కు చెందిన పవన్ 14తులాల బంగారు నగలు తీసుకొని సికింద్రాబాద్ వస్తుండగా ఓ ఆగంతకుడు సిటీలైట్ హోటల్ దగ్గరకు చేరుకోగానే అటాక్ చేశాడు. పవన్ కళ్లలో కారం కొట్టి కత్తితో పొడిచాడు. వెంటనే అతని దగ్గరున్న 14తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ని తీసుకొని పారిపోయాడు దుండగుడు.
కళ్లలో కారం చల్లి..
గాయపడిన పవన్ గట్టిగా అరవడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్కి చేరుకున్న పోలీసులు బాధితుడు పవన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నగలు తీసుకొని పారిపోయిన నిందితుడ్ని పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు. ముఖ్యంగా దాడి చేసిన ప్రదేశంలోని సీసీ ఫుటేజ్తో పాటు హిమాయత్నగర్ నుంచి సికింద్రాబాద్కు నిందితుడు ఏ ఏ మార్గాల్లో వచ్చే అవకాశం ఉందో వాటి ఫుటేజిని చెక్ చేస్తున్నారు.
14తులాల గోల్డ్ ఎత్తుకెళ్లిన దొంగ..
ఓ జువెలరీ షాపుకు చెందిన వ్యక్తిపై దారి దోపిడీ జరిగిన తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎవరో ముందుగానే పథకం వేసుకొని చేసిన నేరంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితుడ్నిపట్టుకునేందుకు అన్నీ పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.