Crime News: ఐదు సంవత్సరాల క్రితం అతడు తన కుటుంబాన్ని మొత్తం పోగుట్టుకున్నాడు. వివిధ కారణాలతో వాళ్లు చనిపోవడంతో అతడి స్నేహితుడి భార్య కోల్ కత్తాకు తీసుకెళ్లింది. అతడు ఆమెను సోదరిగా పిలిచేవాడు. అయితే ఇటీవల ఆమె కూడా చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనకంటూ జీవితంలో ఎవరూ మిగలకపోవడానికి కారణం తానో దురదృష్టవంతుడినని భావించి తనువు చాలించాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ లోని అంబర్ పేటలో సమ్రిత్(25) అతడి కుటుంబం జీవనం సాగిస్తున్నారు. 2016 సంవత్సరంలో అతడి కుటుంబసభ్యులు నెల రోజుల వ్యవధిలో వివిధ కారణాలతో చనిపోయారు. చివరకు సమ్రిత్ ఒక్కడే మిగిలిపోయాడు. దిక్కు తోచని స్థితిలో ఉన్న అతడిని తన స్నేహితుడి భార్య చేరదీసింది. ఆమెను సోదరిగా భావించేవాడు. కోల్ కత్తాకి తీసుకెళ్లి అక్కడే ఉద్యోగంలో కుదిర్చింది. ప్రస్తుతం కోల్కతాలోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో టెక్నికల్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆమెను సోదరిగా భావిస్తూ ప్రతి విషయం పంచుకునేవాడు. అనారోగ్య కారణాలతో ఆమె కూడా ఇటీవలే కన్నుమూయడంతో సమ్రిత్ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. నా అనుకున్న కుటుంబసభ్యులు లేకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. నేనొక దురదృష్టవంతుడనని, తనకున్న ఈవిల్ పవర్స్ వల్లే కుటుంబీకులందరినీ కోల్పోయానని భావించాడు. ఇదే విషయాన్ని తాను ఉండే ఫ్లాట్ లో ప్రతీ ఒక్కరికీ చెప్పేవాడు. ఇటీవల సమ్రిత్ మరింత నిస్పృహకు లోనయ్యాడు.
ఎప్పటిలాగే అతడు సహోద్యోగులతో కలసి విధులకు బయలుదేరాలని ప్రయాణం అయ్యాడు. వాళ్లు బయలుదేరుతుండగా అంతలోనే మనసు మార్చుకుని తాను ఫ్లాట్లోనే ఉంటానని చెప్పాడు. సమ్రిత్ మానసిక స్థితి తెలిసిన ఆ సహోద్యోగులు ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఫోన్ చేశారు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో వాళ్లు భయపడిపోయారు. అనుమానం వచ్చి తిరిగి వారు ఫ్లాట్కు వచ్చారు. తలుపు వేసుకొని గడియ పెట్టి లోపలే ఉండిపోయాడు. ఎంత కొట్టినా తీయకపోవడంతో కంగారు పడ్డారు. తమ వద్ద ఉన్న తాళంతో తలుపు తెరిచి లోపలకు వెళ్లి చూడగా... ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, పక్కన ఓ సిలిండర్ పెట్టుకుని, దాని పైపు ప్లాస్టిక్ కవర్లో ఉంచిన స్థితిలో కనిపించాడు.
తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, విషవాయువులు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికంటూ ఎవరూ లేకపోవడంతో హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రాణ స్నేహితుడు మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లాడు. అపస్మారక స్థితిలో ఉన్న సమ్రిత్ను పోలీసుల సాయంతో బిద్ధన్నగర్ సబ్–డివిజినల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సమ్రిత్ ఫ్లాట్లో సోదాలు చేసిన పోలీసులు రెండు పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన పరిస్థితుల్ని గురించి ఓ లెటర్ లో వివరించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్ నుంచి వెళ్లిన అతడి స్నేహితుడికి అప్పగించారు. సూసైడ్ నోట్లోని చేతి రాత సమ్రిత్దేనని పోలీసులు తేల్చారు. అతడికి విషవాయువుల సిలిండర్ ఎక్కడ నుంచి వచ్చిందనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.