షాద్ నగర్ నిర్భయ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వెటర్నరీ డాక్టర్పై జరిగిన దారుణ హత్యాచారంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ ఈ దారుణంపై స్పందించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారులు మృతురాలికి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ ద్వారాన్ని 20 నిమిషాల పాటు మూసివేసి సంతాపం వ్యక్తం చేశారు. ఆ సమయంలో భక్తులెవరినీ దర్శనానికి అనుమతించలేదు.అదే సమయంలో మహిళల భద్రతను కాంక్షిస్తూ ఆలయం చుట్టూ మహాప్రదక్షిణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ సహా ఇతర పూజారులు పాల్గొన్నారు.
కాగా,హత్యాచార ఘటనలో నిందితులు మహమ్మద్ ఆరిఫ్,జొల్లు శివ,జొల్లు నవీన్,చింతకుంట చెన్నకేశవులు షాద్ నగర్ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు చర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్నారు. నిందితులు షాద్ నగర్ జైల్లో ఉన్న సమయంలో స్థానిక ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న జనాన్ని నియంత్రించడం పోలీసులకు కష్టతరమైంది. దీంతో హైదరాబాద్ నుండి అదనపు ఫోర్స్ను రప్పించి స్వల్ప లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Priyanka reddy murder, Shadnagar, Telangana