గతేడాదిలో తెలంగాణ(Telangana)వ్యాప్తంగా పిల్లలు, చిన్నారులపై జరిగిన అరాచకాలు, నేరాల సంఖ్యకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నమ్మలేని నిజాల్ని బయటపెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే పిల్లలపై దురాగతాలు, అఘాయిత్యాలు (Crimes against children)పెరిగాయని నివేదికలో వెల్లడించింది. 2021వ సంవత్సరంలో రాష్ట్రంలో పిల్లలకు సంబంధించిన వేర్వేరు సంఘటనల్లో మొత్తం 5667 నేరాలు నమోదయ్యాయి. అంటే సరాసరి రోజుకు 15నేరాలు జరిగినట్లుగా ఎన్సీఆర్బీ తమ రిపోర్ట్ ద్వారా బహిర్గతం చేసింది. అదే నేరాల సంఖ్య గడిచిన ఐదేళ్లలో చూసుకుంటే 15.8శాతం పెరిగినట్లుగా వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలో 2017నుంచి 2021 మధ్య ఐదేళ్ల కాలంలో 58.3శాతం నేరాలు జరిగినట్లుగా గణాంకాలతో సహా వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పిల్లలపై దారుణాలకు ఒడిగట్టిన కేసులు 42.5శాతం ఉంటే తెలంగాణలో 15.8శాతం అధికంగా నమోదైనట్లు ఎన్సీఆర్బీ తెలిపింది.
తెలంగాణ టాప్ ప్లేస్ ..
2021 ఏడాదిలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం చూసుకుంటే మొత్తం నేరాల్లో మొత్తం 1836మంది చిన్నారులు బాధితులయ్యారు. అందులో 1835మంది బాలికలు ఉంటే ఒకే అబ్బాయి బాధితుడిగా ఉన్నట్లు ఎన్సీఆర్బీ తమ నివేదికలో పేర్కొంది. నేరాల్లో ఎక్కువగా బాధితులుగా మారతున్నది 6నుంచి 12ఏళ్ల వయసులోపు పిల్లలని తెలిపింది. ఇక 12నుంచి 16సంవత్సరాల మధ్య వయసున్న బాలికలపై లైంగిక దారుణాలకు పాల్పడినట్లుగా తేల్చింది. లెక్కల పరంగా చూసుకుంటే గడిచిన ఏడాదిలోనే 918కేసులు నమోదైనట్లు కుండబద్దలు కొట్టింది ఎన్సీఆర్బీ రిపోర్ట్. ఇక (సెక్షన్.376 IPC) సెక్షన్ 4 & 6 ప్రకారం పోక్సో చట్టం కింద గతేడాదిలో నమోదైన కేసుల్లో 99.9శాతం బాలికలపైనే దారుణాలకు తెగబడినట్లుగా నిర్ధారించింది.
పెద్ద నేరల సంఖ్య ఎక్కువే..
గతేడాదిలో పెద్ద నేరాలు నమోదు చేసిన జాబితాను విడుదల చేసింది ఎన్సీఆర్బీ. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు అధికంగా ఉన్నాయి. ఒక్క సంవత్సరంలోనే 1748పిల్లల్ని అపహరణకు గురైనట్లుగా ఎత్తుకెళ్లిన తెలిపింది. పోక్సో చట్టం కింద మరో 2,698 నేరాలు నమోదయ్యాయి. ఇక ఆడవాళ్లను హింసించడం, అవమానపరచడం, అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులు 102 రిజిస్టర్ అయినట్లుగా ఎన్సీఆర్బీ తెలిపింది. మహిళల మనసును బాధ కలిగించే సంఘటనలు తాలుకు 45 కేసులు నమోదైనట్లుగా రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సైబర్ క్రైమ్ కేసుల్లో కూడా దేశ వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే అత్యధికంగా నమోదవడం గమనార్హం. 17సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి.
ప్రమాదకరమైన విషయం..
ఎన్సీఆర్బీ నివేదికను బట్టి చూస్తుంటే తెలంగాణలో పిల్లల మాన, ప్రాణాలకు రక్షణ లేదనే విషయాన్ని సీఆర్వై విచారం వ్యక్తం చేసింది. ఇది తెలంగాణ సమాజానికి చాలా ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు సీఆర్వై ప్రాంతీయ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్. రాష్ట్రంలో ఈ తరహాలో పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు తగిన ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లల రక్షణపై అన్నీ వర్గాల నుంచి పెరుగుతున్న ఆందోళనకు పరిష్కారమార్గం చూడటం ముఖ్యమైన విషయంగా సీఆర్వై అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల రక్షణ కోసం వ్యవస్థాగత స్థాయిలో తగిన వనరులు, బడ్జెట్ను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు జాన్ రాబర్ట్స్. సమాజంలోని ప్రతి వ్యక్తి పిల్లలపై నేరాల కేసులను నివేదించడంలో భాగస్వాములు కావాలన్నారు. గ్రామీణ స్థాయిలో పిల్లలపై నేరాలను అరికట్టడానికి ఓ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని పట్టణాలు, నగరాల్లో చైల్డ్ క్రైమ్స్ జరగకుండా నిఘా పెంచాలని అభిప్రాయపడింది సీఆర్వై.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana crime news