తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం స్థానంలో అన్ని హంగులతో సరికొత్త సచివాలయం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే.
అయితే సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్కండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
పలువురు జాతీయస్థాయి నేతలు తరలిరానున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తరఫున లలన్ సింగ్ (జేడీయూ నేషనల్ ప్రెసిడెంట్), బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కార్యక్రమానికి హాజరవుతారు. సచివాలయం ప్రారంభం తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్ పుట్టిన రోజు. కేసీఆర్ పుట్టిన రోజునే కొత్త సచివాలయ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అంబేద్కర్ పేరు పెట్టుకొని.. కొత్త సచివాలయంను కేసీఆర్ బర్త్ డే రోజు ప్రారంభించడం ఏంటని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
మరోవైపు ఇటీవలే సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ పనుల్ని సమీక్షించారు. అధికారులతో మాట్లాడి పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాన్ని తెలుసుకున్నారు. సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను 10 రోజుల్లోనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Local News, Telangana