(M.Balakrishna,News18,Hyderabad)
అల్పపీడన ప్రభావం తెలంగాణ(Telangana)లో ఇంకా కొనసాగుతోంది. 24గంటలుగా వర్షాలు కాస్త తగ్గు ముఖం పట్టాయి. వరుణుడు శాంతించినా వరదలు వదలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. నిన్నటి వరకు ప్రభావం చూపిన అల్పపీడనం శుక్రవారం(Friday) ఒరిస్సా తీరంతో పాటు పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. గురువారం 19డిగ్రీల నార్త్ వైపున ఉన్న ఉపరితల ఆవర్తనం ఈస్ట్వెస్ట్ షీర్ జోన్ దిశగా శుక్రవారం బలహీనపడింది.
వదలని వరుణుడు..
ఈఅల్పపీడన ప్రభావం కారణంగా శుక్రవారం, శనివారం తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు. అంతే కాదు తెలంగాణలో పలుచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లుగా హైదరాబాద్ వాతావరణకేంద్రం సంచాలకులు. ప్రకటించారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఐదు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని తెలిపింది. మరో మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉండడంతో.. మిగతా చోట్ల సైతం సాధారణం నుంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వరదలతో అస్తవ్యస్థం..
తెలంగాణలోని సుమారు 8జిల్లాల్లో వర్షప్రభావం ఉంటుందని పేర్కొన్న వాతావరణకేంద్రం రాజధాని నగరం హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లుగా ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. బల్దియా యంత్రాంగాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ అప్రమత్తం చేశారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ నదికి వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉందని తెలిపింది.
డేంజర్ జోన్లో భద్రాద్రి..
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. ప్రాణహిత, పెన్గంగా, వార్ధా నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలంలోనూ గోదావరి నీటి మట్టం పెరుగోతోంది. దీంతో భద్రాద్రికి రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాచలం బ్రిడ్జిపై 48 గంటల పాటు రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలంలో 144 సెక్షన్ విధించారు. 48 గంటలపాటు ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం 62 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం.. రాత్రికి లేదంటే రేపు ఉదయానికి గోదావరి మట్టం 70 అడుగులకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాలు డేంజర్ జోన్లో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imd hyderabad, Telangana rains