తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Command control center) ఆగస్ట్(August) 4న ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వందల కోట్ల రూపాయలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ 18అంతస్తుల్లో నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చేతుల మీదుగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవం సమయానికి అన్నీ పనులు పూర్తి చేయాలనే ఆలోచనలో భాగంగా గత ఐదు రోజుల నుంచి ఫినిషింగ్ వర్క్స్ చేయించడంలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది.
అగస్ట్ 4న ముహుర్తం..
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మరో కలికితురాయిగా మారనుంది. ఏడేళ్ల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న ఈ భారీ భవనం అగస్ట్ 4వ తేదిన సీఎం చేతుల మీదుగానే ప్రారంభం కానుంది. వందల కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ నిర్మించడం జరిగింది. 18 అంతస్తులతో నిర్మించబడిన ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన భవనంలో 14వ ఫ్లోర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు చూసేందుకు అనుమతిస్తారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి సమయం తక్కువగా ఉండటంతో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్ పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
పూర్తి కావొచ్చిన పనులు..
మెయిన్ ఎంట్రెన్స్, పోర్టీకో, గ్రాండ్ ఎంట్రీ, మ్యూజియం, ఆడిటోరియం, ఫ్లోర్ల పనులను దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన ఫినిషింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. వందల మంది కార్మికులతో ఎంట్రెన్స్ దగ్గర ఉన్న రోడ్డు మీద చెట్లు తొలగించి కంపౌండ్ వాల్ చుట్టూ వెదురు చెట్లు నాటుతున్నారు. మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర డివైడర్లు, గేట్ దగ్గర పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. పనులు పెండింగ్ లేకుండా మొత్తం అగస్ట్ 2వ తేది సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలించనున్నందున దానికి బంధించిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి చర్చించారు.
విదేశాల నుంచి డేటా పరికరాలు కొనుగోలు..
ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కావాల్సిన డేటా సెంటర్ పరికరాలు జర్మనీ, బెల్జియం నుంచి రావాల్సి ఉంది. వాటి నిమిత్తం ప్రభుత్వం రూ. 45 కోట్లు విడుదల చేయాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. బిల్డింగ్ పనులు పూర్తయినప్పటికీ డేటా సెంటర్ పరికరాలు రానందున కమాండ్ కంట్రోల్ సెంటర్పూర్తి స్థాయిలో నిర్వహణలోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే సిటీలోని అన్ని సీసీ కెమెరాలను ఈ కేంద్రం నుంచి పోలీస్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇందుకు ఓ ఫ్లోర్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్ని ఏర్పాటు చేయనున్నారు.
కరోనా కారణంగా జాప్యం..
జిల్లా కేంద్రాల్లో ఎస్పీల దగ్గర ఉండే సీసీ టీవీ ఫుటేజ్ను ఈ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తారని తెలుస్తోంది. ఇందుకు డేటా సెంటర్ కీలకం కానుంది. ప్రస్తుతానికి కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర హోం మంత్రి , డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చాంబర్లు రెడీ అయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే ఆపరేట్ అవుతుందని పోలీస్ అధికారులు చెప్తున్నారు. బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సీపీ ఆఫీస్ ను ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ కు అప్పగించనున్నట్లు తెలుస్తున్నది. సుమారు ఏడేళ్లుగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు జరుగుతున్నాయి. రూ.585 కోట్ల వ్యయంతో షాపూర్ జీ పల్లోంజి కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. కరోనా కారణంగా నిర్మాణం విషయంలో జాప్యం జరిగినట్లుగా అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana News