జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలన్న కేసీఆర్ (KCR)ఆలోచనలకు అనుగూణంగానే కొత్తగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఎన్డీఏ(NDA) ప్రభుత్వాన్ని కూల్చి ..కేంద్రంలో కొత్త ఫ్రంట్తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చర్చలు, సమావేశాలు, సలహాలు, సూచనలు చేస్తున్న కేసీఆర్ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ(Assembly)తో పాటు లోక్సభ(Lok Sabha)స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే ఇందుకోసం ఆయన అసెంబ్లీ స్థానం గజ్వేల్(Gajwel)అని కన్ఫామ్ అయినప్పటికి ..ఏ పార్లమెంట్ నియోజకవర్గం అయితే బెటర్ అనే ఆలోచన కూడా చేసినట్లుగా తెలుస్తోంది. పదేళ్ల క్రితం భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్కి ఎన్నికైన స్థానం నుంచే మళ్లీ ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట కేసీఆర్. అంతే కాదు ఆ జిల్లాలోనే టీఆర్ఎస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండటంతో వేరే ఆలోచన లేకుండా అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని గులాబీ శ్రేణుల సైతం సూచిస్తున్నారని తెలుస్తోంది.
ఎంపీగా అక్కడి నుంచే పోటీ ..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం దేశ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ . రాబోయే ఎన్నికలకు అందుకు తగినట్లుగానే రాష్ట్రంలో కూడా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు గులాబీ బాస్. ఇతర రాష్ట్రాల పర్యటనలు, ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశాలు, సలహాలు, సంప్రదింపులు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ 2024 ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంతో పాటుగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. సుమారు పదేళ్ల క్రితం అంటే 2014లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచి కేసీఆర్ సెంటిమెంట్తో పాటు పార్టీ స్ట్రెంగ్త్ ప్రకారం మళ్లీ 2024లో అక్కడి నుంచే బరిలోకి దిగాలని చూస్తున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఎలాగైనా హస్తినకు పోవలె..
సమీకరణాలు మారి..ప్రజలు కేంద్రంలో నూతన ఫ్రంట్కి అధికారం కట్టబెడితే కేసీఆర్కి కీలక పదవులు దక్కే అకాశం ఉంది. అందుకే మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించి తన చరిష్మాను జాతీయ రాజకీయాల్లో సైతం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట గులాబీ బాస్. జాతీయ రాజకీయాల్లో రాణించాలన్న, పార్లమెంట్ సభల్లో అఢుగుపెట్టాలన్న లోక్సభ లేదంటే రాజ్యసభకు ఎన్నికవ్వాలి. కేసీఆర్కు అటు లోక్సభ, ఇటు రాజ్యసభ రెండింటిలో అవకాశం ఉండటంతో ఏవిధంగానైనా జాతీయ రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలుస్తారని గులాబీశ్రేణులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. మరి కేసీఆర్ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా లోక్సభ నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెడతారా లేదంటే రాజ్యసభలో తమకున్న బలంతో రాజ్యసభ సభ్యుడిగా జాతీయ రాజకీయాలను శాసిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana Politics, TRS leaders