MLC Kalvakuntla Kavitha: ఈడీ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ఇరువర్గాల వాదనలు విని తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. కాగా కవిత తరపున కపిల్ సిబాల్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. కవితకు ఇచ్చిన నోటీసుల్లో ఇన్వెస్టిగేషన్ కు రమ్మని చెప్పారు. ఆమె నిందితురాలు కానప్పుడు ఇన్వెస్టిగేషన్ కు ఎలా పిలుస్తారని కోర్టు దృష్టికి సిబాల్ తీసుకొచ్చారు.
ఈడీ విచారణ సరిగా లేదని..తనకు నోటీసులు ఇవ్వడం సరి కాదని..విచారణ సమయంలో తన ఫోన్ ను సీజ్ చేశారని కవిత పిటీషన్ లో పలు అంశాలను లేవనెత్తారు. ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో సూర్యాస్తమయం వరకు విచారించడాన్ని తప్పుబడుతూ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే PMLA చట్టం ప్రకారం ఈడీ అధికారులు ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చు. అలాగే ఎంతసేపైనా విచారించవచ్చని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు సుప్రీంలో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో కవితకు, ఈడీకి లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈడీ అధికారాలను ప్రస్తావిస్తూ..నళిని చిదంబరం పిటీషన్ తో కలిపి కవిత పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే 3 సార్లు విచారించారు. మొదటగా ఆమెకు ఈనెల 11న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కవిత ఆరోజు విచారణకు హాజరు అయ్యారు. సుమారు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. అయితే ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో రాత్రి వరకు విచారించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈడీ అధికారులు నిబంధనలకు లోబడి విచారణ జరపడం లేదని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈనెల 24న విచారణ జరుపుతామని పేర్కొంది.
అయితే 11న కవితను విచారించిన అధికారులు 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టులో పిటీషన్ ఉన్న కారణంగా ఆ తీర్పు వచ్చే వరకు విచారణకు రాలేనని కవిత తన ప్రతినిధి ద్వారా ఈడీకి సమాచారం అందించారు. ఆరోజు నెలకొన్న హైడ్రామాతో విచారణ జరగలేదు. అయితే ఈనెల 20న విచారణకు రావాలని కవితకు మూడోసారి నోటీసులు ఇచ్చారు. దీనితో ఆమె విచారణకు హాజరు కాక తప్పలేదు. ఆ మరుసటి రోజు కూడా విచారణకు రావాలని చెప్పగా..21న కూడా కవిత విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 రోజుల పాటు 30 గంటలు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది.
అయితే 3 వారాలకు తదుపరి విచారణ వాయిదా వేయడంతో నెక్స్ట్ కవిత ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఆమెకు మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటారా? లేక సుప్రీం తీర్పు వరకు వెయిట్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Kalvakuntla Kavitha, Supreme Court, Telangana