మనిషికి చివరి దశలో ఓ ముద్ద పెట్టే దిక్కులేకపోతే ఎంత మంది ఉంటే ఏం లాభం. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులు ఒంటరిని చేశారు. అతని పేరుతో ఉన్న ఆస్తిని ఇవ్వలేదనే కోపంతో అతని ప్రాణాలు తీసిన ఘటన హైదరాబాద్(Hyderabad)లో వెలుగుచూసింది. దాదాపు జీవితంలో చివరి దశలో ఉన్న వృద్దుడు భార్య, పిల్లకు దూరంగా బ్రతుకుతున్నాడు. అతని పేరుతో ఉన్న ఆస్తి కోసం కన్న కొడుకే కిరాతకుడిగా మారాడు.
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి హత్య..
హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని విమాన్నగర్లో ఆదివారం ఓ హత్య జరిగింది. 84సంవత్సరాల వయసున్న వృద్దుడ్ని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు బేగంపేట పోలీసులు స్పాట్కి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తి పేరు అబ్రహం లింకన్గా గుర్తించారు. ఆర్మీలో జాబ్ చేసి అటుపై బీహెచ్ఈఎల్లో పని చేసి పదవీ విరమణ పొందారు. అబ్రహం లింకన్కి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య మహబూబ్నగర్లో ఉంటోంది. ఆమెకు ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండో భార్య శేరిలింగంపల్లిలో ఉంటోంది. ఆమెకు ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు.
ఆస్తి కోసం మర్డర్ ..
ఇద్దరు భార్యలు, ఐదుగురు సంతానం ఉన్నప్పటికి అబ్రహం లింకన్ను వాళ్లెవరూ చూడకపోవడంతో విమాన్నగర్లోని రాహుల్ రెస్టారెంట్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. అక్కడే నివాసముంటున్నాడు. అబ్రహం లింకన్కి ఆస్తులు, ఆప్తులు ఉన్నప్పటికి ఎవరూ లేని అనాధగా మారాడు. ప్రభుత్వ ఉద్యోగి పని చేయడంతో రిటైర్డ్ ఆర్మీ కోటాలో షాద్నగర్లో నాలుగున్నర ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించింది. దాంతో పాటు శేరిలింగంపల్లిలో 200గజాల రెండు ఫ్లాట్లు ఉన్నాయి. తనకు డబ్బులు అవసరమై ఉండి వాటిని అమ్ముకునే ప్రయత్నంలోనే అబ్రహం లింకన్కు రెండో భార్య కొడుకు కిరణ్కు గొడవలు తలెత్తాయి. తండ్రి పేరుతో ఉన్న ఆస్తులను కిరణ్ ఎవరికి తెలియకుండా కొద్ది రోజుల క్రితం నకిలీ గిఫ్ట్ డీడ్తో రూ.75 లక్షలకు విక్రయించాడు.
హత్య చేసింది కన్నకొడుకే..
కొడుకు స్తలాలు విక్రయించిన విషయం అబ్రహాం లింకన్ తెలియడంతో స్తలాలు కొనుగోలు చేసిన వాళ్లను నిలదీశాడు. వాళ్లు మరో పాతిక లక్షలు ఇస్తామని చెప్పారు. షాద్నగర్లోని భూమి, రెండు ఫ్లాట్లు అమ్మగా వచ్చిన 25లక్షలు తన పేరుతో రాయాలని కిరణ్ తండ్రితో గొడవపడ్డాడు. తండ్రి కుదరదని చెప్పడంతో ఆదివారం తండ్రిని హతమార్చేందుకు గొడ్డలి తీసుకొని విమాన్నగర్కు వెళ్లాడు కిరణ్. తండ్రి మెడపై గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికాడు. తీవ్ర గాయాలపాలైన అబ్రహం లింకన్ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తేల్చారు.
కటకటాల వెనక్కి కొడుకు..
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మర్డర్ కేసులో దోషి కన్నకొడుకేనని తేల్చారు పోలీసులు. ఆస్తి కోసమే ఇంతటి దురాగతానికి ఒడిగట్టునట్లుగా నిర్ధారించుకున్నారు. మృతుడు అబ్రహాం లింకన్ కొడుకు కిరణ్పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad crime, Son kills father, Telangana crime news