(దస్తగిరి, రిపోర్టర్, న్యూస్-18 తెలుగు)
సీతారామా శోభాయాత్రకు కౌంట్డౌన్ మొదలైంది. శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేపడుతోందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్లో సీతారామ శోభాయాత్ర సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీతారాంబాగ్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర హనుమాన్ టేక్డీలో ముగిసేవరకు వందలాదిమంది పోలీసులతో భారీ బందోబస్తును చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అన్ని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా బందోబస్తును పర్యవేక్షిస్తామన్నారు. శోభాయాత్రలో డీజే సౌండ్ సిస్టమ్లకు ఎలాంటి అనుమతి లేదన్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు.
శోభాయాత్రలో విగ్రహాల ప్రతిమల సైజు 20 అడుగుల కంటే ఎక్కువగా పెంచరాదని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా 6 ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీఆర్ఎఫ్ టీమ్స్ను కూడా సిద్ధంగా ఉంచుతామన్నారు. జీహెచ్ఎంసీ తరపునా శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్కుమార్. రోడ్డు మరమ్మతులు, వీధిదీపాల ఏర్పాట్లు, ఇతర వసతులు కల్పిస్తామన్నారు.
పోలీసుల రూట్ మ్యాప్
ఈ నెల 30న శోభాయాత్ర జరిగే మంగళ్హాట్, జుమ్మేరాత్బజార్, సిద్దిఅం బర్బజార్, అఫ్జల్గం జ్, గౌలిగూడ మీదుగా హనుమాన్ టేక్డీలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సీపీ ఆనంద్, ట్రాఫిక్ విభాగం కమిషనర్ సుధీర్బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్లు రూట్మార్చ్ నిర్వహించారు. అనంతరం హనుమాన్టేక్డీలోని హనుమాన్ వ్యాయామశాల గ్రౌండ్స్ ను పర్యవేక్షించారు. శోభాయాత్రకు వెయ్యి మంది లా ఆండ్ ఆర్డర్, 400 మంది ట్రాఫిక్ పోలీసులతో భారీ బందోబస్తు నిర్వ హించనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్య నగర్ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ప్రతినిధులు డాక్టర్ భగవంతరావు, గోవింద్రాఠీ, కార్పొరేటర్ శంకర్ యాదవ్, సురేఖ, మాజీ కార్పొరేటర్ మెట్టు వైకుంఠం, నాయకులు బంగారు సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లుండే శ్రీరామనవమి:
శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad