కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఇటీవల పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టేకు కోర్టు నిరాకరించింది. అయితే సునీల్ కనుగోలును అరెస్ట్ చేయోద్దన్న కోర్టు ఈనెల 8న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులపై సునీల్ కనుగోలు డిసెంబర్ 29న హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆనాడు విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 3న తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. ఈ మేరకు నేడు కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 8న సునీల్ పోలీసుల విచారణకు రావాలన్న కోర్టు అతన్ని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. మరి సునీల్ కనుగోలు పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాలి.
అసలు కేసు ఏంటి?
సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మొత్తం ఐదు కేసులు నమోదు కాగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో పోస్టుల ఐపీ అడ్రస్ ఆధారంగా హైద్రాబాద్ మాదాపూర్ లోని సునీల్ కనుగోలు కార్యాలయంపై సీసీఎస్ పోలీసులు దాడులు చేశారు. డిసెంబర్ 13న సునీల్ కార్యాలయంలో పోలీసులు సోదా సమయంలో కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ కేసులో సునీల్ కొనుగోలు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. డిసెంబర్ 26నే విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ సునీల్ కనుగోలు మాత్రం పోలీసుల విచారణకు హాజరు కాలేదు.
అయితే పోలీసులు మరోసారి సునీల్ కనుగోలుకు నోటీసులు ఇచ్చారు. ఈసారి డిసెంబర్ 27న నోటీసులు ఇవ్వగా ఈ నోటీసులను కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి తీసుకున్నారు. అయితే సునీల్ కనుగోలు పోలీసుల నోటీసులను హైకోర్టులో సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు డిసెంబర్ 29న విచారణ జరిపింది. ఈ విచారణలో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో కోర్టు సునీల్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Telangana High Court