అగ్గిపుల్ల సబ్బుబిళ్ల కుక్కపిల్ల.... కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ. ఓ చోర శిఖామణి అదే రుజువు చేసి చూపించారు. దొంగతనం చేసేందుకు కూడా ఏ ఇల్లైతే ఏంటి అనుకున్నారు. ఏకంగా దొంగల్ని పట్టుకునే పోలీసుడి ఇంటినే టార్గెట్ చేశారు. సమయం చూసి కన్నం వేశాడు. అంతే... చివరికి సీసీటీవీ కెమెరాకు కూడా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటూ... మొత్తం సొత్తును దోచుకెళ్లాడు మహానగరంలో ఓ మాయగాడు.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో నివసిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కొమ్మి ఆనందయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ నెల 16వ తేదీన కాకినాడలో నివసిస్తున్న తన కుమారుడి ఇంటికి భార్యతో కలిసి ఆనందయ్య వెళ్లారు. ఇదే సరైన సమయం అని భావించిన దొంగలు... ఇంటికి కన్నం వేశారు. 300 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 2 కేజీల బరువైన వెండి ఆభరణాలతో పాటు 40 వేల రూపాయల నగదు, 500 యూఎస్ డాలర్లు, పలు ఖరీదైన వాచ్ లను కూడా చోరీ చేశారు.
విషయం గుర్తించిన కారు డ్రైవర్ వెంటనే ఇంటి యజమాని ఆనందయ్యకు ఫోన్ చేసి తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఆనందయ్య ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ ప్రారంభించి ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Robbery