ఓ నిండు గర్భిణి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మరో పదిరోజుల్లో కవల పిల్లలకు జన్మనివ్వాల్సిన తల్లి... మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన సంభారపు అరుణ్, రీతూ దంపతులు హైదరాబాద్లోని హస్తినాపురం వద్ద హోటల్ నడుపుతూ జీవిస్తున్నారు.
అదే గ్రామానికి చెందిన నల్లవెల్లి సుందర్ హైదరాబాద్లో ఆటో నడుపుతూ భార్య రాధికతో కలిసి జీవిస్తున్నాడు. ఆదివారం వారు తమ స్వగ్రామంలోని చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చారు. సాయంత్రం అరుణ్ భార్యతో కలిసి కారులో హైదరాబాద్కు బయల్దేరాడు. అయితే నల్లవెల్లి సుందర్ తన భార్య రాధిక, పిల్లలు శ్యామ్(5), బ్లెస్సీలను అరుణ్ కారులో ఎక్కించి, తాను బైక్పై వెళ్లాడు. కారు యాచారం మండలం పాత మాల్ వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న అరుణ్ భార్య రీతూ (22), సుందర్ కుమారుడు నల్లవెల్లి శ్యామ్(5) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి, గాయపడ్డ వారిలో చిన్నారి బ్లెస్సీ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. రీతూ మరో పదిరోజుల్లోనే కవల పిల్లలకు జన్మనివ్వాల్సి ఉంది. ఇంతలోనే ఇంత దారుణం చోటు చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News