HYDERABAD MEETING WITH TRS WORKING PRESIDENT KTR CREATE STROM IN TELANGANA BJP HERE IS THE DETAILS AK
Telangana: తెలంగాణ బీజేపీలో కేటీఆర్ పంచాయతీ.. రంగంలోకి కమిటీ... ఢిల్లీ పెద్దల ఫోకస్
కేటీఆర్ (ఫైల్ ఫోటో)
Telangana: అసలు ఇలాంటి కీలకమైన అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ముందు పార్టీలోని పెద్దలతో దీనిపై చర్చించారా ? లేక దీనిపై కనీసం సమాచారం అందించారా ? అన్నది కూడా హాట్ టాపిక్గా మారింది.
తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ.. ఆ దిశగా కొన్ని విజయాలు కూడా సాధించింది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాబోయే ఎన్నికల నాటికి టీఆర్ఎస్కు తామే పోటీ అన్న స్థాయిలో రాష్ట్రంలో ఎదగాలని వ్యూహరచన చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలవడం... జీహెచ్ఎంసీకి సంబంధించిన లింగోజిగూడ డివిజన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీలో నిలపొద్దని కోరడం ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కొత్త పంచాయతీకి తెరలేపింది.
కేటీఆర్తో బీజేపీ నేతల సమావేశం జరిగి రోజులు గడుస్తున్నాయి. అయితే తమకు తెలియకుండానే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నేతృత్వంలోని కొందరు నేతలు, కార్పొరేటర్లు కేటీఆర్ను కలవడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై ఆయన ముగ్గురు సభ్యులతో కమిటీ కూడా వేశారు.
కేటీఆర్తో సమావేశానికి వెళ్లిన నేతలు, కార్పొరేటర్లతో చర్చించిన కమిటీ.. ఈ అంశంపై త్వరలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి నివేదిక కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. మరోవైపు పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్తో పోరాడేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఒక్క డివిజన్లో ఏకగ్రీవం కోసం టీఆర్ఎస్ నేతలను కలవడం ఏంటన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది.
అసలు ఇలాంటి కీలకమైన అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ముందు పార్టీలోని పెద్దలతో దీనిపై చర్చించారా ? లేక దీనిపై కనీసం సమాచారం అందించారా ? అన్నది కూడా హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కొందరు నేతలు... ఈ వ్యవహారంపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. దీంతో కేటీఆర్తో బీజేపీ నేతల సమావేశంపై ఢిల్లీ పెద్దలు కూడా ఆరా తీస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కేటీఆర్తో బీజేపీ నేతల మీటింగ్.. ఆ పార్టీలో పెద్ద పంచాయతీకి తెరలేపినట్టు కనిపిస్తోంది.