Dastagir Ahmed, News18, Hyderabad
హైదరాబాద్ (Hyderabad) సిటీలో వారం రోజుల క్రితం జరిగిన హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. షాకింగ్ విషయాలు అనేకన్నా ఇది సైకో క్రైమ్ సినిమాకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. మూసీ నదిలో దొరికిన తలతో.. తీగలాగగా డొంక కదిలింది. ఇది కేవలం హత్య మాత్రమే కాదు.. అంతకు మించి ఘోరం అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. హత్యకు గురైన మహిళను అనురాధకు గుర్తించిన పోలీసులు.. ఆమె ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. తల సరే.. మరి మిగతా శరీరం ఏమైందీ అని విచారించిన పోలీసులు.. విషయం తెలిసి వణికిపోయారు. గత ఆరు రోజుల కింద మలక్పేట మూసీ పరీవాహక ప్రాంతమైన తీగలగూడ వద్ద ప్లాస్టిక్ కవర్లో మహిళ తల కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఈ వ్యవహారంపై కేసులో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. పోలీసులు మలక్పేట, సైదాబాద్, చాదర్ఘాట్, పాతబస్తీతో పలుచోట్ల పోస్టర్లను చూపిస్తూ ఆరా తీశారు. ఆ క్రమంలోనే సదరు మహిళను నర్సుగా పని చేస్తున్న ఎర్రం అనురాధగా గుర్తించారు. మృతురాలి సోదరితో పాటు బావ తల అనురాధగా గుర్తించారు. మృతురాలు, వడ్డీ వ్యాపారం చేస్తుందని, డబ్బు విషయంలోనే హత్యకు గురైనట్లు ఆమె సోదరి తెలిపారు.
ఈ క్రమంలో నిందితుడి చంద్రమౌళిని పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాచినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ క్రమంలో చైతన్యపురిలోని నిందితుడి ఇంటికి వెళ్లి పరిశీలించగా.. దిగ్భ్రాంతికి గురయ్యారు. అనురాధ శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కాళ్లను నిందితుడు ఫ్రిజ్లో దాచారు. మిగతా శరీర భాగాలను బకెట్లో దాచాడు. మృతురాలి శరీర భాగాలను ఉస్మానియా ఆసుప్రతికి తరలించారు. నిందితుడు చంద్రమౌళి 15యేళ్లుగా అనూరాధతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె దగ్గర చంద్రమోహన్ రూ.7 లక్షలు తీసుకున్నాడు. అంతేకాదు.. అనూరాధకు చంద్రమౌళి ఇంట్లోనే ఓ గదిని అద్దెకు ఇచ్చాడు. డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని.. మే 12వ తేదీన ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత కటింగ్ మెషీన్ తో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికేశాడు. వాటిని ఫ్రిజ్ లో దాచి పెట్టాడు.
వాటినుంచి వాసన రాకుండా కెమికల్స్ లాంటివి చల్లాడు. హత్య చేసిన మూడు రోజుల తరువాత అంటే మే 15వ తేదీన తలను ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకుని.. ఓ ఆటోలో మూసీ నది ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అఫ్జల్ నగర్ కమ్యూనిటీ హాలు సమీపంలోని డొంకల్లో పడేశాడు. పడేసిన రెండు రోజులకు అంటే మే 17వ తేదీన తలను గమనించిన బల్డియా ఉద్యోగి శేఖర్ నాయక్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చి కలకలం రేగింది. దాదాపు వారం రోజులపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఆటో నెంబర్, సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు ఛేదించారు. మొదట ఆటో డ్రైవర్ ను పట్టుకుని.. అతను చెప్పిన వివరాలతో నిందితుడిని పట్టుకున్నారు. అతని ఇంట్లోని ఫ్రిజ్ లో మహిళ మిగతా శరీర భాగాలను చూసి షాక్ అయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Telangana