తెలుగు రాష్ట్రాల్లో వాతావరణానికి సంబంధించి తాజా సూచనలు ఒకింత ఆందోళనకరంగా ఉన్నాయి. అక్టోబర్ నెలలోనూ రికార్డులను మించి వర్షపాతాన్ని చవిచూసిన రెండు రాష్ట్రాల్లో మళ్లీ కుంభవృష్టి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. విశాఖపట్నం వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం నుంచి వర్షాలు కురుస్తాయి. ఏపీలో ఎక్కువ వర్షాలు కురవడానికి అవకాశముంటే, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనూ వానలు దంచికొట్టే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.
తాజా వర్షాలకు కారణం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటమే. దక్షిణ బంగాళాఖాతంలో బుధవారంనాడు అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని కారణంగా ఏపీ వ్యాప్తంగా రాబోయే 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికలో.. తెలంగాణలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం, 29, 30 తేదీల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Rains, WEATHER, Weather report