మహా శివరాత్రి వచ్చేస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి, మరోవైపు శివాలయాల వద్ద ఇప్పటి నుంచే మహా శివరాత్రి కోసం జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వేములవాడలో శివరాత్రి ఏర్పాట్లపై తెలంగాణ మంత్రి కేటీర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో మంగళవారం వేములవాడలో జరగనున్న మహా శివరాత్రి వేడుకలపై ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... యాదాద్రి తరహాలో భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడను రానున్న రోజుల్లో అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి రాష్ట్రంతో పాటు, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారన్నారు. దీంతో భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు.
వేములవాడకు స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముందస్తు జాగ్రత్తగా అదనపు అంబులెన్స్లు, ఫైర్ అంబులెన్స్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారుల్ని కేటీఆర ఆదేశించారు.. వేములవాడ జాతరకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు అదనపు నిధుల కేటాయిస్తామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు కేటీఆర్.
సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై అతి ఎత్తైన శివుడి విగ్రహం, కాటేజీల నిర్మాణం, అడ్వెంచర్ గేమ్స్ అలాగే వేములవాడ శివారులోని నాంపల్లి గుట్టపై కేబుల్ కార్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అత్యున్నత ప్రమాణాలతో వేములవాడ యువత కోసం మినీ స్టేడియం నిర్మాణం తొందరలోనే పూర్తి చేస్తామన్నారు. కొదురుపాక నుంచి వేములవాడ వరకు నాలుగు లైన్లు రహదారి నిర్మాణం, నాంపల్లి గుట్టపై రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, KTR, Local News, Vemulawada