MLC Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మూడు సార్లు విచారించారు. సుమారు 30 గంటలకు పైగా విచారణ జరగగా..ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో విచారించడంపై..రాత్రి వరకు ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్చి 15న కవిత తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేశారు. కవిత పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈనెల 24న విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ క్రమంలో కవిత పిటీషన్ విచారణపై బిగ్ ట్విస్ట్ నెలకొంది.
అయితే ఈనెల 11, 20, 21 తేదీల్లో ఆమెను అధికారులు విచారించారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ పిటీషన్ కింద విచారణ జరిపి ఈడీ విచారణపై తీర్పు ఇవ్వాలని విచారణకు ముందు పిటీషన్ లో ఆమె పేర్కొన్నారు. కానీ 24నే విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. అయితే ఉన్నట్టుండి కవిత పిటీషన్ విచారణ తేదీలో మార్పు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈనెల 24న కాకుండా 27న విచారణ జాబితాలో చేర్చినట్లు సమాచారం. అయితే సడన్ గా విచారణ తేదీ మార్పుకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇక కవిత తదుపరి ఈడీ విచారణ ఎప్పుడనేది క్లారిటీ లేదు. దీనితో విచారణకు ముందే పిటీషన్ పై విచారణ జరగాలని కవిత భావిస్తుండగా..మరో 3 రోజులు ముందుకు సుప్రీం విచారణ వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత మూడు సార్లు విచారణకు హాజరయ్యారు. ఈనెల 11న తొలిసారి ఆమె ఈడీ విచారణకు హాజరవ్వగా..సుమారు 8 గంటలకు పైగా అధికారులు విచారించారు. ఆ తరువాత నిన్న కూడా సుమారు 10 గంటల పాటు కవితను ప్రశ్నించారు. ఇక ఈరోజు కూడా 10 గంటలు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మొత్తం 30 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించారు. అయితే ఆమె విచారణ ఇంతటితో ముగిసిందా? లేక మరోసారి విచారణకు హాజరవ్వాలా? లేక మరికొన్ని రోజులకు విచారణకు రావాలని నోటీసులిస్తారా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Kalvakuntla Kavitha, Supreme Court, Telangana