(M.Balakrishna,News18,Hyderabad)
మోసాలు చేయడంలో సైబర్ కేటుగాళ్లు ఆరితేరిపోతున్నారు. జనం ఆసక్తిని, ఏమరపాటును, అమాయకత్వాన్ని తమకు అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారు. ఓవైపు రోజు రోజుకి ప్రజలు సైబర్ క్రైమ్స్(Cyber Crimes)పట్ల అవగాహాన పెంచుకుంటుంటే సైబర్ కేటుగాళ్లు తమ రూటు మార్చారు. ఎప్పుడు వెళ్లే పద్దతుల్లో కాకుండా కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే మనందరికి తెలిసిన గూగుల్ పే(Google Pay), పేటీమ్(Paytm),యూపీఐ పేమెంట్స్(UPI Payments)కాకుండా ఇప్పుడు కొత్త పద్ధతికి తెర తీశారు సైబర్ కేటుగాళ్లు.
మహానగరంలో మోసగాళ్లు..
స్విగ్గీ , జొమాటో , అమెజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్ పార్శిల్స్ మీకు వచ్చినట్లు మీ ఇంటికి వచ్చి ఒక పార్శల్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. మీరు ఆర్డర్ చేయలేదని చెప్పిన వెంటనే సరే మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి ఆర్డర్ కాన్సల్ చేస్తాను అంటారు. ఆ మాటలు నమ్మి మీరు ఓటీపీ చెప్పారో ఇక మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు వారి ఖాతాలోకి వెళ్లిపోతుంది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో హెయిర్ క్లిప్లు, క్రీమ్లు, సన్గ్లాసెస్ వంటి విచిత్రమైన వస్తువులతో మీరు ఇటీవల ఎప్పుడూ ఆర్డర్ చేయని డెలివరీ ప్యాకేజీలతో కొంత మంది మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
కొత్త దారిలో చీటింగ్..
ఈ తరహాలోనే ఆన్లైన్ ఆర్డర్ కోసం డెలివరీ ఎగ్జిక్యూటివ్కు చెల్లించమని కోరుతూ కొరియర్ కంపెనీల నుండి మీకు ఫేక్ మెసెజ్లు కూడా చాలా మందికి వస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్త స్కామ్లో భాగమైన ఈ డెలివరీల గురించి సైబరాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్ ప్రజలను హెచ్చరికలు జారీ చేసింది. ఈ స్కామ్లో ఒక వ్యక్తి డెలివరీ ఏజెంట్గా నటిస్తూ మీ ఇంటికి వస్తాడు. మీరు ఆర్డర్ ఇవ్వలేదని చెప్పిన తర్వాత రేటింగ్ ప్రయోజనాల కోసమో ఆర్డర్ రద్దు చేయడనికో ఓటీపీ OTPని చెప్పమని వారు మిమ్మల్ని అడుగుతారు. ఇలా మీరు ఒక్కసారి వారికి OTPని చెబితే, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ వారికి చేరిపోతాయి. దీంతో మీ కార్డ్స్ లో ఉన్న మొత్తం వారి ఖాతాలోకి వెళ్లిపోతుంది.
అనుమానం వస్తే ఫోన్ చేస్తే చాలు..
ఎవరైన అనుమానిత ప్యాకేజీని స్వీకరించి, మీకు తెలిసిన వారు ఎవరూ మీకు బహుమతి పంపలేదని నిర్ధారించినట్లయితే మీరు dcp-dd-hyd@tspolice.gov.inకి మెయిల్ పంపడం ద్వారా లేదా 040-27852412కు కాల్ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. మరో వైపు ఇప్పటికే సిటీలో జరుగుతున్న ఈ సైబర్ క్రైమ్లపై పోలీసులు ఒక కన్నేశారు. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు..? ఎక్కడ నుంచి ఆపరేషన్స్ జరుగుతున్నాయి..? అనే అంశాలపై దృష్టి పెట్టారు. దీంతో పాటు ఈ కొత్త మోసాలకు సంబంధించి ప్రజల్లో అవగాహాన కల్పిండానికి చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER FRAUD, Telangana News