కాసుల కక్కుర్తి కోసం కొన్ని ఆస్పత్రులు చేస్తున్న పనులు దారుణంగా మారుతున్నాయి. చిరంజీవి చేసిన ఠాగూర్ సినిమాలో చనిపోయిన వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్లు చేస్తారు. లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు. సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మృతిచెందిన వ్యకికి చికిత్సను అందించి డాక్టర్లు ఠాగూర్ సినిమాలోని సీన్ను తలపించేలా వైద్యం చేశారు. ఈ ఘటప ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్ చోటు చేసుకుంది. దీంతో మృతుని కుటుంబసభ్యులు గురువారం రాత్రి హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... స్టేషన్ ఘన్పూర్కు చెందిన మునుగెల శివకృష్ణ(35) సూర్యాపేటలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో లోన్ రికవరీగా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఉమా పిల్లలు అక్షత, కన్నయ్యలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. అయితే శివకృష్ణకు గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు సూర్యాపేట నుంచి నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషయమంగా ఉందని ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్కు తరలించాలని సూచించారు.
అయితే వెంటనే అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో శివకృష్ణను ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్కు తీసుకొచ్చారు. పరీక్షించిన ఎల్బీనగర్ కామినేని వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. గుండె నాళాలు మూసుకుపోయాయని మూడు స్టట్స్ వేయాలని వైద్యులు చెప్పారు. శివకృష్ణకు ఇన్సూరెన్స్ కార్డు ఉన్నా ఇంకా అప్రూవల్ రాలేదని డబ్బులు చెల్లించాలని చెప్పడంతో వెంటనే డబ్బులు చెల్లించారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని కిడ్నీలు చెడిపోయాయని, డయాలసిస్ చేస్తున్నామని అక్కడి డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు.
డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి చేయడంతో రూ. 7లక్షలు చెల్లించామని ఇంకా డబ్బులు చెల్లించలేమని, రోగిని నిమ్స్కు తీసుకెళ్లామని బంధువుల అడిగారు. రెండు రోజులుగా రోగిని తమకు చూపించకుండా, రోగి పరిస్థితి కుటుంబసభ్యులకు తెలుపకుండా గుట్టుగా ఉంచారని ఆరోపించారు. అయితే గురువారం ఉదయం నుంచి రోగి బంధువులు, కుటుంబ సభ్యులు షిఫ్ట్ చేస్తామని మరింత ఒత్తిడి చేశారు.
అయితే రాత్రి సమయంలో రోగి బంధువులు, కుటుంబ సభ్యులకు తెలుపకుండా దొంగచాటుగా రోగిని అంబులెన్స్లో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బంధువులు, కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకున్నారు. ఆస్పత్రి ఎదుట సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. మృతి చెందిన వ్యక్తికి వెంటిలేటర్ ఏర్పాటు చేసి చికిత్సను అందించారని బంధువులు ఆరోపిస్తున్నారు. కేవలం ఇన్సూరెన్స్ను క్లయిమ్ చేసుకునేందుకు మృతిచెందిన వ్యక్తికి చికిత్సను అందించారని ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News