HYDERABAD HEAVY RAINS FOR ANOTHER 3 DAYS IN TELANGANA YELLOW WARNING ISSUED DETAILS HERE VB
Telangana Rain: రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాల వాసులకు హెచ్చరికలు జారీ..
ప్రతీకాత్మక చిత్రం
Telangana Rain: తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం హైదరాబాద్లో కురిసిన జోరువానకు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన మార్గాలన్నీ వరద నీటితో నిండిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Yellow Alert) ను ప్రకటించింది.
నైరుతి బంగాళాఖాతం(Southwestern Bay of Bengal) లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. పల్లె, పట్టణం, నగరాల్లో జోరువాన కురిసింది. రేపటి నుంచి మరో మూడు రోజుల వరకు కూడా కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గురువారం కురిసిన వర్షంతో భాగ్యనగర వీధులు వర్షపునీటితో నిండిపోయాయి. ఒకటి, రెండు చోట్ల తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా ఎల్లో వార్నింగ్(Yellow Warning) జారీచేశారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరం మొత్తం తడిచి ముద్దయింది. ఎక్కడ చూసినా రోడ్లపై నీళ్లే కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాలు వరద నీటితో జలమయమవగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
అరగంటలోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్లో 7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. నగరంలోని మిగతా ప్రాంతాల్లో 5 నుంచి 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి (కె)లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హైదరాబాద్లో గత రాత్రి ఏడున్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వానకు జనజీవనం స్తంభించి పోయింది. మూడు గంటల్లోనే ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ నెల 6 న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఆ తర్వాత అల్పపీడనం (Hypotension) వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ చేసింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడడంతో నేడు తేలిక పాటి వర్షాలు కురుస్తాయని చెప్పగా.. రేపటి నుంచి మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్రంలోని 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు అప్రపత్తం అయ్యారు. హైదరాబాద్ లో జీహెచ్ ఎంసీ అధికారులు రక్షణ చర్యలకు సిద్దమయ్యారు. ఇలా ఏర్పడటానికి గల కారణం ఏంటంటే.. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడడంతో ఈరోజు తేలికపాటి జల్లులు కురిశాయి.
ఇలానే మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్రంలోని 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ (Karimnagar), రాజన్నసిరిసిల్ల, జనగాం, సిద్దిపేట(Siddipeta), మహబూబాబాద్ (Mahabubabad), నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలు ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. తమిళనాడు, కర్ణాటక దక్షిణ ప్రాంతం, ఏపీ కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల వరకు విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. కాగా- భారీ వర్షాల వల్ల మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని చాలిస్గావ్ ప్రాంతంలో వరదనీరు ముంచెత్తింది. కన్నడ్ ఘాట్ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదనీరు పోటెత్తడంతో కన్నడ్ ఘాట్లో మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
అక్షర్ధామ్ టెంపుల్, గోల్ఫ్ క్లబ్ రోడ్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీర ప్రాంత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనితోపాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమ(Rayalaseema) జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. ఛత్తీస్గఢ్ దక్షిణ ప్రాంతం మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణికి తోడు రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండటం వల్ల మూడు రోజుల వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.