తెలంగాణ (Telangana) సంస్కృతి సాంప్రదాయాలను చాటే ప్రధాన పండుగల్లో ఒకటైన బోనాల ఉత్సవాలు (Bonala Festival) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రథమ పూజ నిర్వహించడంతో బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. మొదటి పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం (Bonam) సమర్పించనున్నారు. నేడు లంగర్హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం మరియు తొట్టెలను నిర్వాహకులు తీసుకెళతారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి రాష్ట్ర మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జులై 10న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల నృత్యాలు, శివసత్తులతో కలిసి అంగరంగ వైభవంగా అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్లి బోనం సమర్పించనున్నారు. ఈ మహత్తర వేడుకలకు గోల్కొండ, లంగర్హౌస్ ప్రాంతాలు వేదిక అవనున్నాయి.
విదేశాల్లో ఉన్నవారైనా బోనం ఇవ్వొచ్చు..
సికింద్రాబాద్ పేరు వినగానే చాలా మందికి గుర్తుకొచ్చేది మహంకాళి ఆలయం. సికింద్రాబాద్ జనరల్ బజార్ లో కొలువైన శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి (Secunderabad Ujjaini Mahankali Temple) 207 ఏళ్ల సుదీర్గ చరిత్ర ఉంది. నేటి నుంచి ఆషాఢమాసం మొదలుకానుండటంతో హైదరాబాద్లో ముందస్తుగానే బోనాల పండుగ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది మహంకాళి బోనాల జాతరను జులై 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించారు. దేశ, విదేశాల్లోని భక్తులు సైతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్లైన్ ద్వారా బోనాలు సమర్పించుకునేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం ఆన్లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించారు.
ఆన్లైన్లో బుక్ చేసుకుంటే.. ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని, గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారు.ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం పంపిణీ చేస్తారని, ఆ బియ్యాన్ని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చు. బియ్యంతో పాటు బెల్లం, అక్షింతలు, పసుపు –కుంకుమ పంపిస్తారని చెప్పారు.
ఎప్పటి నుంచి సేవలు?
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్లైన్లో బోనం సమర్పించాలనుకునే భక్తులకు జూలై 4 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. మీ సేవ, ఆలయ వెబ్ సైట్, పోస్ట్ ఆఫీస్ ద్వారా భక్తులు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు రూ.300, ఇతర దేశాల భక్తులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని పోస్ట్ ఆఫీస్, ఆర్టీసీ కొరియర్ సేవల ద్వారా దేశీయ భక్తుల ఇంటికి చేరవేస్తారు.
జూలై 5న ఎల్లమ్మ కల్యాణం..
జూలై 5న ఎల్లమ్మ కల్యాణం నిర్వహించనున్నారని, జూలై 4 లోగా భక్తులు ఆన్లైన్లో కల్యాణం సేవలను బుక్ చేసుకోవాలి. అమ్మవారి కల్యాణానికి సంబంధించి ఆన్లైన్ సేవలు బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, పసుపు కుంకుమ, డ్రై పూట్స్ ఇంటికి పంపిస్తారు. మీ సేవ, ఆలయ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ కల్యాణ సేవలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana Bonalu