హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. డివైడర్ ను బలంగా ఢీకొట్టి ఎగిరిపడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజేంద్ర నగర్ కారు ప్రమాదానికి సంబంధించి నార్సింగ్ పోలీసులు చెప్పిన వివరాలివి..
బహదూర్ పురాకు చెందిన నలుగురు యువకులు అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్ కారులో సన్ సిటీ నుంచి మెహదీపట్నంవైపుగా ప్రయాణించారు. రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై వారి కారు అదుపుతప్పి, డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
సిటీలో చలి తీవ్రత పెరిగి పొగమంచు దట్టంగా ఏర్పడటం, దాని కారణంగానే రోడ్డు సరిగా కనిపించకపోవడం వల్లే కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదంలో గాయపడ్డ నలుగురు యువకుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజకూ పడిపోతూ చలి తీవ్రత పెరుగుతోంది. బంగాళా ఖాతంలో అల్పపీడనం దీనికి మరింత ఉపకరిస్తోంది. ఆదిలాబాద్లో సోమవారం అత్యల్పంగా 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో ఈ సీజన్లో అత్యల్పంగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదేనని వారు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, ఇప్పుడు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car accident, Hyderabad, Road accident